KCR: రాజకీయాల్లో నేతల తలరాతలు ఊహించని విధంగా మారుతుంటాయి. ఒక్కో సారి నేతలు తీసుకున్న నిర్ణయాలు ప్రత్యర్థులకు లాభం చేకూరుస్తుంటాయి. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలో తీసుకున్న ఓ నిర్ణయం ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముగ్గురి నేతలకు బంగారు బాట అయ్యింది. అందులో ఓ నేత కేంద్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదగగా ఇద్దరు రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు ఛీఫ్ లు అయ్యారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కేసిఆర్ వ్యూహం బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు కలసివచ్చాయి. ఈ ముగ్గురు నేతల తలరాతలు మారడానికి ఓ విధంగా పరోక్షంగా కేసిఆర్యే కారణం. మరో పక్క ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి కూడా ఓ రకంగా కేసిఆర్ కారణం అని చెప్పవచ్చు. ఏడాది ముందు ఎన్నికలు అయిపోయి కేసిఆర్ రెండవ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయనకు ఏపిలో టీడీపీలో అధికారంలోకి రాకుండా చేయడం కోసం కేసిఆర్..జగన్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన విషయం తెలిసిందే.
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 2018లో జరిగిన ఎన్నికల్లో అంబర్పేట నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్, కొడంగల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డిలు పరాజయం పాలైయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన వీరు ముగ్గురు ఆ తరువాత 2019 లో ఎన్నికల్లో ఎంపిలుగా విజయం సాధించారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి కిషన్ రెడ్డి, కరీంనగర్ లోక్ సభ స్థానం నుండి బండి సంజయ్, మల్కాజ్గిరి స్థానం నుండి రేవంత్ రెడ్డిలు పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించారు. ఇదే వీరి దశ తిరగడానికి కారణం అయ్యింది.
కిషన్ రెడ్డి తొలుత కేంద్ర సహాయ మంత్రి, ఆ తరువాత కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. అదే విధంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులు అయ్యారు. రాజకీయంగా వీరిని దెబ్బతీయాలని కేసిఆర్ ప్రయత్నించినా ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చింది. నాడు చంద్రబాబు మంత్రి వర్గంలో కేసిఆర్ ను తీసుకుని ఉంటే ఆయన పార్టీ నుండి బయటవెళ్లే వారు కాదు, టీఆర్ఎస్ స్థాపించేవారు కాదు, రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని ఇప్పటికీ అంటుంటారు. అందుకే అంటారు రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరని. ఊహించని పరిణామాలు సంభవిస్తుంటాయి.