YSRCP: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన, టీడీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నేతలు పలువురు వైసీపీలో చేరారు. రాజోలు జనసేన మాజీ ఇన్ చార్జి బొంతు రాజేశ్వరరావు, అమలాపురం జనసేన మాజీ ఇన్ చార్జి రాజబాబు, ముమ్మడివరం ఇన్ చార్జి పితాని బాలకృష్ణ, పిఠాపురం మాజీ ఇన్ చార్జి ఎం శేషుకుమారి, కాకినాడ మాజీ మేయర్ సరోజ తదితరులు ఇవేళ వైసీపీలో చేరారు.
తణుకులో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వీరు పార్టీలో చేరగా, జగన్ వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలానే పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గణపతిరావు కుమారుడు గణేష్ బాబు, మనవడు గణపతిరావు, టీడీపీ సీనియర్ నేత గంగరాజు తదితరులు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. తొలుత పి గన్నవరంకు టీడీపీ అభ్యర్ధిని ప్రకటించి ఆ తర్వాత సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీ అసంతృప్తులు వైసీపీలో జాయన్ అయ్యారు.
బొంతు రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడుగా పేరు పొందారు. పదవీ విరమణ అనంతరం రాజేశ్వరరావు వైసీపీలో చేరారు. రాజోలు నుండి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో రాజోలు నుండి రాజేశ్వరరావుపై జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు పలికారు.
రాపాక వైసీపీకి దగ్గర కావడంతో బొంతు రాజేశ్వరరావు అసంతృప్తికి గురైయ్యారు. ఆ నేపథ్యంలో 2021 జూలై 17న ఆయనను రాష్ట్ర పీఆర్ అండ్ ఆర్డీ, రూరల్ వాటర్ సప్లై సలహదారుగా జగన్ సర్కార్ నియమించింది. అయితే నియోజకవర్గ వైసీపీలో రాపాక వరప్రసాద్ హవా కొనసాగుతుండటంతో బొంతు రాజేశ్వరరావు వైసీపీని వీడారు. వైసీపీకి, సలహాదారు పదవికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
దీంతో రాజోలు జనసేన ఇన్ చార్జిగా నియమితులైయ్యారు. రాజోలు జనసేన అభ్యర్ధిగా అవకాశం లభిస్తుందని బొంతు రాజేశ్వరరావు ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ కు టిక్కెట్ కేటాయించారు. దీంతో బొంతు రాజేశ్వరరావు జనసేన అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవేళ తన అనుచరులతో కలిసి జనసేనకు బైబై చెప్పారు. అనంతరం మరల వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.