Adimulapu Suresh-10th Exams: ఆదిమూలపు సురేశ్ Adimulapu Suresh-10th Exams: మళ్లీ ఓ ప్రకటనతో ముందుకొచ్చారు. ఇప్పటికే కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో పది పరిక్షలను రెండుసార్లు వాయిదా వేసింది ప్రభుత్వం. అయితే.. కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ఇక పరీక్షలను రద్దు చేస్తుందని భావించిన వారికి మంత్రి సురేశ్ మరో షాక్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పది పరిక్షలు నిర్వహిస్తామని మలి ప్రకటన చేశారు. కరోనా తగ్గిన తర్వాత మరోసారి పరిస్థితులను సమీక్షించి పరిక్షలు నిర్వహిస్తామంటున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం మొండి వైఖరికి వెళ్తోందనే వాదనలూ లేకపోలేదు. మంత్రి ప్రకటనపై విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల భవిష్యత్ కోసమే పరిక్షల నిర్వహణ అంటోంది.
రాష్ట్రంలోని పది విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడో మార్చి నెలలో జరగాల్సిన పరిక్షలు జూన్ వచ్చేస్తున్నా ఇంకా ఏమీ తేలలేదు. కరోనా తీవ్రత తగ్గుతుందని భావించినా ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ రాష్ట్రంలో రోజుకి 15వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పది పరిక్షలపై పట్టు విడవడం లేదు. మరోసారి సమీక్ష చేసి పరిక్ష తేదీలు ప్రకటిస్తామని అంటోంది. ఒకవేళ జూన్ నెలలో పరిక్షలు నిర్వహిస్తే.. కరోనా తీవ్రత పెరిగితే.. ఎవరిది బాధ్యత అనే ప్రశ్నలు వస్తున్నాయి. అలా కాకుండా పరిక్షలను జూన్-జూలైలో నిర్వహిస్తే వాల్యుయేషన్ ఎప్పుడు.. రిజల్ట్ ఎప్పుడు.. ఇంటర్ లో ప్రవేశాలెప్పుడు.. అనే ప్రశ్నలూ వస్తున్నాయి.
Read More:Andhra Pradesh: ఏపీ రాజకీయ చదరంగంలో పది పరిక్షలు..! ఎవరు ఒప్పు.. ఎవరు తప్పు..?
నిజానికి ఈసరికి విద్యార్ధులకు రిజల్ట్స్ కూడా వచ్చేసి.. ఇంటర్ ఏ కాలేజీలో, ఏ కోర్సు అని ఆలోచించే సమయం. అడ్మిషన్లు సగంపైగా జరిగిపోవాల్సింది. కానీ.. కరోనా అన్నింటినీ మార్చేసింది. కరోనా తీవ్రతను గుర్తించే కేంద్రం సీబీఎస్ఈ, ఆయా రాష్ట్రాలు పది పరిక్షలు రద్దు చేసి అప్పుడే సర్టిఫికెట్లు కూడా ఇచ్చేశాయి. దీంతో కొత్త తలనొప్పులు తెచ్చుకోలేకుండా ఆయా ప్రభుత్వాలు పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాయి. కానీ.. ఏపీ మాత్రం పరిక్షల నిర్వహణకే మొగ్గుచూపుతోంది. అన్ని ఏర్పాట్లు చేశాం.. జాగ్రత్తలు తీసుకున్నాం.. అంటున్న ఏపీ ప్రభుత్వం.. రివర్స్ లో ఏదన్నా జరగరానిది జరిగితే సమాధానం చెప్పుకోగలుగుతుందా? ప్రతిపక్షం విమర్శలకు సమాధానం చెప్తుందా? ప్రజు, విద్యారంగ నిపుణుల వ్యతిరేకత తట్టుకుంటుందా? అనేది ప్రస్తావనార్హం. మరి.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా ఆలోచిస్తారో.. చూడాలి.