జగన్ కేబినెట్ లో కొత్తగా ఇద్దరికి మాత్రమే ప్రవేశం లభించనుంది. అయితే ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే మిగిలింది. ఆషాఢం పూర్తై శ్రావణం మొదలు కాగానే ఆ ఇద్దరికీ పదవీయోగం లభిస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఉంది. ఈనెల 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అని తెలుస్తోంది.
ఈమేరకు గవర్నర్ కార్యాలయానికి కూడా సమాచారం ఉంది. కుదరకపోతే ఆల్టర్నేట్ డేట్ 24 అని తేలింది కానీ.. ఆ ఇద్దరి పేర్లు మాత్రం బయటకు రాలేదు. పార్టీ కీలక నేతలకు కూడా స్పష్టంగా తెలియదంటే జగన్ ఈ విషయంలో ఎంత గుంభనంగా ఉన్నారో అర్థమవుతోంది. ఖాళీ అవుతున్న రెండు పదవులు బీసీ మంత్రులవికావడంతో మళ్లీ మంత్రివర్గంలో కుల సమతుల్యం దెబ్బతినకుండా ఇద్దరు బీసీలకే స్థానం కల్పించాలని జగన్ నిర్ణయించుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది.ఈ సందర్భంగా ఆశ్చర్యకరంగా శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పేరు బయటికొచ్చింది.
ఆయన బీసీ కావడంతో పాటు చాలా సీనియర్ అయినందున జగన్ తమ్మినేని వైపు మొగ్గుచూపుతున్నారు అంటున్నారు.అన్ లాక్ మొదలయ్యాక సీతారాం.. వరుసగా తీర్థయాత్రలు చేశారు. శ్రీకాళహస్తి సహా.. ఇతర దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. పదవీయోగంపై ముందే సమాచారం ఉండటం వల్లే ఆయన దేవాలయాలకు వెళ్లొచ్చారని, అయితే విషయం మాత్రం సన్నిహితుల వద్ద కూడా బైటపెట్టలేదనే టాక్ వినిపిస్తోంది.
అదే సమయంలో మిగతా మంత్రి వర్గంలో మార్పులు చేర్పులుంటాయని అనుకున్నా.. అది కూడా దాదాపు ఉండకపోవచ్చని అర్థమైపోయింది. ఉన్న పోర్టిఫోలియోలు మారవు, కొత్తగా తీసుకునే ఇద్దరికి.. పిల్లి సుభాష్ చంద్రబోస్ చూసిన రెవెన్యూ శాఖ, మోపిదేవి వెంకట రమణ చూసిన పశు సంవర్థక, మత్స్య శాఖలు మాత్రమే బదిలీ అవుతాయి. ఆశావహులు చాలామందే ఉన్నా.. ఆ అదృష్టం మాత్రం ఇద్దరినే వరించబోతోంది.