ఏపీలో ముందస్తు ఎన్నికలకు అస్కారమే లేదు.. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.. అని ఇటీవల కాలం వరకూ స్పష్టం చేస్తూ వచ్చిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి .. ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పర్యటించిన సజ్జల రామకృష్ణారెడ్డి .. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్దంగా ఉందని అన్నారు. సీఎం జగన్ ఏపీకి చేసిన అభివృద్ధితో పోలిస్తే ఏ రాష్ట్రంలోనూ కనీసం పది శాతం కూడా చేయలేదన్నారు. టీడీపీ అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తమ పార్టీ ని హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కానీ ప్రజలంతా మళ్లీ వైసీపీకే పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని సజ్జల పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్వచ్చందంగా అసెంబ్లీని రద్దు చేయకుండా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైసీపీకి లేదని గతంలో పలు పర్యాయాలు సజ్జల స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు సజ్జల .. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్దంగా ఉంది అని వ్యాఖ్యలు చేయడంతో ముందస్తు ఎన్నికలు వస్తాయా అనే అనుమానాలు మళ్లీ వ్యక్తం అవుతున్నాయి. సజ్జల వ్యాఖ్యల కంటే కొద్ది రోజుల ముందు మంత్రి సిదిరి అప్పలరాజు ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పేర్కొన్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎన్నికలపై మాట్లాడుతుండటంతో మోడీ కూడా ముందస్తుకు సై అన్నారా..? లోక్ సభ ఎన్నికలు ముందస్తుకు వస్తే జగన్ కూడా అంగీకరించే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు, కాన్ఫిడెన్స్ కల్గించేందుకు ఇలా మాట్లాడారా..? లేక పార్టీ అధిష్టానం నుండి వచ్చిన సంకేతాల మూలంగానే అలా వ్యాఖ్యలు చేశారా..? అనేది తెలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో వైసీపీ మరల అధికారం కైవశం చేసుకోవడం ఖాయమన్నట్లుగా ఇటీవల పలు జాతీయ సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వచ్చాయి. తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు జనవరి, ఫిబ్రవరి నెలలో జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలతో పాటు ఎన్నికలకు వెళ్లాలంటే ముందస్తుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాలి. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ చర్చించారని వార్తలు వచ్చాయి.
ముందస్తు ఎన్నికలకు తానైతే సిద్దంగా లేననీ, ఒక వేళ లోక్ సభ ఎన్నికలు ముందస్తుకు వెళితే తాను కూడా సిద్దమేనని జగన్ చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఏపిలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన కూడా అంటున్నాయి. ఆ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టాయి. ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటి నుండే అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఇబ్బంది లేదనుకున్న నియోజకవర్గాల నేతలకు అంతర్గతంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ప్రచారం చేసుకోవల్సిందిగా అధిష్టానాలు చెప్పేస్తున్నాయి.
Tirupati: మెడికల్ హబ్గా తిరుపతి – టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి