బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో కుండపోతగా కురిసిన వర్షాలు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. వరద ప్రవాహానికి వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వీధులన్నీ జలమయం అయి చెరువులను తలపించాయి. 1500 ఇళ్లకుపైగా జలదిగ్బంధమయ్యాయి. 20 వేలకు పైగా ఇళ్లు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు దెబ్బతిన్నాయి. వీధుల్లో నిలిపిన కార్లు, ఆటోలు, బైక్ లు వరద నీటికి కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ గడపాల్సి వచ్చింది. 30 పాత పాత భవనాలు, గోడలు కూలిపోయాయి. సహాయక చర్యల కోసం సైన్యాన్ని కూడా రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది. వందేళ్ల తరువాత కురిసిన రికార్డు వర్షపాతానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షలు జరిపి యుద్ద ప్రాతిపదికన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలోనూ భారీ వర్షాలు, వరదలకు వందలాది మంది నిరాశ్రయులైయ్యారు. కృష్ణానదికి వరద పోటేత్తడంతో నది పరివాహాక ప్రాంతాల్లోని గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. వేలాది పంట పంట పొలాలు ముంపునకు గురి అయ్యాయి. వివిధ జిల్లాలలో పది మంది మృత్యువాత పడ్డారు. చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై ఆదేశాలు ఇచ్చారు.
కేంద్రం నుండి సహకారం అందిస్తాం – మోడి
కాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఫోన్ చేశారు. భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ సీఎం కెసిఆర్, ఏపి సీఎం వైఎస్ జగన్లతో మోడీ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో కేంద్రం నుండి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు మోడి. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లోని భారీవర్షాలు, వరదల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. ఇరు రాష్ట్రాలకు సాధ్యమైనంత సాయం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. వరద నష్టం నుండి త్వరగా రెండు రాష్ట్రాలు కోలుకోవాలని అమిత్ షా అకాంక్షించారు.