ఈ ప్రపంచంలో విలువలేని వస్తువులు ఉండవు.
అవి అనులోమ విలువలు కావొచ్చు- విలోమ విలువలైనా కావచ్చు
ఏదేమైనా విలువలేని వస్తువులు మాత్రం ఉండవనేది ఖాయం!
కానీ, ప్రతి వస్తువుకూ వెలకట్టడం ఎంతటివారికైనా సాధ్యం కాదు!
ఉదాహరణకు, అమ్మా నాన్నల ప్రేమాభిమానాలకు వెలకట్టగలమా?
అన్నాదమ్ముల ఆత్మీయతలకు ఖరీదు కట్టే షరాబులున్నారా?
అక్కాచెల్లెళ్ల అనురాగానికి ధర నిర్ణయించగలమా?
జీవితాన్ని పంచిచ్చే జీవన సహచరుల కిమ్మత్తు ఇంతని చెప్పే కుసంస్కారులను ఊహించ గలమా?
బంధుమిత్రుల ఆదరాభిమానాలకు మూల్యం చెల్లించగలమా?
కాలానికి కట్టిన బాల్యమిత్రుల స్నేహసేతువుల రేటెంతో చెప్పమంటే ఏంచెప్పగలం?
ఆశయాలూ, ఆదర్శాల భావసంపదలో నిస్వార్థంగా భాగం పంచిచ్చే సహచరుల వెల ఎంతో నిర్ధారించగలమా?
చల్లని నీడనిచ్చే చెట్టునూ, చక్కని నీటినిచ్చే సెలయేటినీ, వెచ్చని భద్రతనిచ్చే గూటినీ, అణాపైసల లెక్కలో అభివర్ణించగలమా?
మనసు చెదిరిన వేళ, ఇంత ప్రశాంతతనిచ్చే పుస్తకం ఖరీదెంతో చెప్పగలమా?
నిష్కారణంగా, మనల్ని చూసి నవ్వే పసిబిడ్డ నవ్వు ధర ఎంతని చెప్పడం?
దారంట మనకోసం పూచే గడ్డి చేమంతి పువ్వు వెల ఎంతని అడిగితే ఏం చెప్పగలం?
మరి వాటన్నిటికీ ఏమీ విలువ లేదా?
ఆ మాట అనగల గుండెలు -మనిషన్న వాడికి- ఉంటాయా?
***
ఇదంతా కవిత్వమని కొట్టిపారేయడం చాలా సులభం! కానీ, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం మాత్రం అంత తేలిక కాదు!!
అయినా, తెలియక అడుగుతున్నా- కవిత్వానికి వెలకట్టడం మాత్రం అంత సులువైన పనా? రెండున్నర శతాబ్దాల బానిసత్వం నుంచి విముక్తి పొందే నిమిత్తం, దేశమంతా కలిసి పోరాడవలసిన చారిత్రిక ఆవశ్యకతను నొక్కి చెప్పిన “మహాకవి” మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం- “అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయి” అన్నారు మహాకవి. ఆ మాటల వెల ఇంతింతని తూచి చెప్పడం సాధ్యమేనా? “మంచి గతమున కొంచెమేనోయ్- మందగించక ముందుకడుగేయ్!” అన్న కర్తవ్య బోధ కేవలం మాటల మూటేనా? “మతములన్నియు మాసిపోవును- జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును!” అన్న మాటల్లోని మేధస్సును తూచే రాళ్లు ఎవరిదగ్గిర ఉన్నాయని?
ఇన్ని ప్రశ్నలు కాదు- ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. దేశానికి మతపిచ్చి ముదిరిన దుర్ఘడియల్లో తన ప్రాణాన్ని పళ్లెంలో పెట్టి ఇచ్చేసిన గాంధీజీ త్యాగశీలత మూల్యాన్ని మదింపు వేసే దుస్సాహసానికి ఎవరైనా తలపడగలరా? ఆనాడు తాను అవలంబించిన వైఖరి కారణంగా తన ప్రాణానికి ముప్పున్న సంగతి గాంధీజీకి తెలియదా? తెలిసి తెలిసి ఆయన ఆ వైఖరి ఎందుకు వహించినట్లు? ఈ ప్రశ్నకు సమాధానం -80 ఏళ్ళ వృద్ధ జాతిపిత గాంధీజీని నిలువునా కాల్చిపారేసిన గోడ్సే తో సహా- ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ తెలుసు!! “నా జీవనమే నా సందేశం!” అన్న గాంధీజీ బతుకు పుస్తకాన్ని తిరగేసిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రశ్నకు జవాబు తెలుసు!!
తెలియనట్లు నటించే వాళ్ళ కోసం చిట్టి కథ ఒకటి చెప్తా వినండి!
***
ఓ రోజు పొద్దున్నే గాంధీజీ ఎదో రాసుకుంటూ ఉండగా, ఆయనకో విషయం గుర్తుకొచ్చింది. ఆ రోజు గాంధీజీ ఓ పెద్దమనిషిని కలవాల్సి వుంది. అది జ్ఞాపకం రాగానే ఆయన లేచి చకచకా తయారై పోయారు. అంతలో ఆయనకి మరేదో విషయం గుర్తుకు వచ్చింది. తన పుస్తకాలూ, కాయితాలూ పెట్టుకునే బల్ల మీద ఎదో వస్తువు కోసం వెతకడం మొదలు పెట్టారు.
గాంధీజీ అనుచరుల్లో ఒకరైన కాకా సాహెబ్ కేల్కర్ ఇదంతా చూస్తూ ఉండబట్టలేకపోయారు-
“ఏం కావాలి బాపూ?” అని మృదువుగా అడిగారు కాకాసాహెబు.
“ఇక్కడ చిన్న పెన్సిల్ ముక్క ఉండాలి కాకాజీ! కనిపించడం లేదు….”అన్నారు గాంధీజీ.
“దాన్ని నేను చూసి భద్రంగా ఉంచుతాను బాపూ! ప్రస్తుతానికి దీన్ని వాడుకోండి….” అంటూ కాకాజీ కొత్త పెన్సిల్ ఒకటి తనజేబులోంచి తీసివ్వబోయారు.
“కుదరదు! నాకు ఆ పెన్సిల్ ముక్కే కావాలి!! మద్రాసులో ఉండగా నటేశన్ కొడుకు నాకిచ్చిన బహుమతి అది…. ” అంటూ గాంధీజీ తన శోధన కొనసాగించారు.
“బాపూ, అవతల ఆ పెద్దమనిషికి ఇచ్చిన టైం అయిపోతోంది… చిన్న పెన్సిల్ ముక్క కోసం ఆ పెద్దమనిషి దగ్గిర మాట పోగొట్టుకుంటారా?” అన్నారు కాకాజీ -కాస్తంత- అసహనంగా.
గాంధీజీకి కోపం సర్రున రేగింది!
“ఎవరు చిన్న? ఎవరు పెద్ద? నా దృష్టిలో నా అప్పాయింట్మెంట్ కన్నా ఆ చిన్నారి నాకు ప్రేమతో ఇచ్చిన చిట్టి పెన్సిల్ ముక్కే ఎక్కువ విలువైంది కాకాజీ!” అన్నారు గాంధీజీ దృఢంగా.
కాకాజీతో సహా అక్కడున్న వాళ్లందరికీ కళ్ళు విచ్చుకున్నాయి. అందరూ కలిసి వెతకడంతో ఆ పెన్సిల్ ముక్క దొరకడం- గాంధీజీ అనుకున్న టైంకు ఆ పెద్దమనిషిని కలవడం జరిగిపోయాయి.
***
ఈ చిట్టి కథ మనకి ఏం చెప్తోంది?
వస్తువుల విలువలు వేరు- వాటి వెలలు వేరు!
అదీ గాంధీజీ జీవన సందేశం!
గాంధీజీ 150వ జయంతి సందర్భంగా మనం ఈ విషయం గురించి -ఒక్కక్షణం- నిలబడి నిదానంగా ఆలోచించుకుంటే బావుంటుంది!
-మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ