ప్రపంచం లో చైనీస్ సరుకులు అమ్మని చోటు లేనట్లుగానే, ఆ దేశపు సామెతలు చెల్లుబాటు కానీ రంగాలు కూడా లేవు. ఉదాహరణకి ఈ సామెత చూడండి- “పగసాధించి తీరాల్సిందే అనుకునే వాళ్ళు రెండు సమాధులను సిద్ధం చేసి పెట్టుకోవాలి; ఒకటి తమ శత్రువు కోసం – మరొకటి తమ కోసం!” – ఇది ఓ చైనీస్ సామెత. మన దేశంలో దీనికి ఉన్నంత డిమాండ్ బహుశా చైనాలో కూడా ఉండదేమో.
మన ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు. పగతీర్చుకోవడానికే జీవితాలను అంకితం చేసిన మహానుభావులు లేని చోటు ఎక్కడా ఉండదేమో. పోనీ వీళ్ళందరూ ఒకే పోలికలతో ఉంటారా అంటే అలాక్కూడా ఉండరు. ఒకేలా ఆలోచించే అలవాటు కూడా ఉండదు వీళ్ళకి. కొందరైతే గుట్టుగా తమ పగ తీర్చుకోవాలని చూస్తారు. మరి కొందరు బాహాటంగా పగ సాధించాలని పడరాని పాట్లు పడుతూ ఉంటారు. వాళ్ళైనా వీళ్ళయినా, పగ సాధించడం కోసం చట్టాలను ఉల్లంఘించడం కద్దు. మరికొందరు శాంతి భద్రతల యంత్రాంగం దృష్టికి రాకుండా, గోప్యంగా తమ పగ సాధించుకోవాలని చూస్తారు. చిత్రమేమిటంటే, ఇక్కడ మాత్రమే- అంటే మనదేశంలో ఒక్కచోటే- పగ సాధించడానికి చట్టాలనూ, చట్టసభలనూ, రాజ్యాంగ వ్యవస్థలనూ, చివరికి రాజ్యాంగాన్నిసైతం వినియోగించడం చూస్తాం. పగ తీరడం మాట దేవుడెరుగు కానీ, దశాబ్దాల అనుభవం ప్రాతిపదికగా రూపు దిద్దుకున్న రాజ్యాంగ వ్యవస్థలు మాత్రం ఈ క్రమంలో సర్వనాశనం అయిపోతాయి! మన దేశం ఇదే విషాద భరిత నాటకంలోని ఆసక్తికరమైన ఒక అంకాన్ని చూస్తోందిప్పుడు.
అనగనగా ఓ చిదంబరం! దేశ దేశాలు తిరిగేసి, తెగబోలెడు చదివేసి, రెండు చేతులా సంపాదించి, సుప్రీం కోర్ట్ న్యాయవాదిగా జెండా ఎగరేశాడు. నిదానంగా రాజకీయ రంగ ప్రవేశం చేశాడాయన. సరే, గత ఏభై ఏళ్లుగా, మన దేశంలో రాజకీయాలకన్నా లాభసాటి వృత్తీ, వ్యాపారం మరేదీ లేనందువల్ల, అందులోనూ కుమ్మేశాడు! డజన్ల కొద్దీ భవంతులనూ, సినిమా హాళ్ళనూ, మాల్స్ నూ, వందల ఎకరాల తోటలూ దొరువులనూ సంపాదించాడాయన. రాష్ట్ర రాజకీయాల్లో చాణక్య నీతికి చిరునామా అనిపించుకున్నారు. కేంద్రంలో ఆర్ధిక మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. హోమ్ మంత్రిగా గండరగండళ్ళను గడగడలాడించాడు. కాంగ్రెస్ కొలువుకూటంలో ప్రధాన విదూషకుడిగా రాణించాడు. ఇన్ని సాధించిన వాడు, తన సుపుత్రుణ్ణి తనకు వారసుడిగా తీర్చి దిద్దాలని, తనకు మించిన స్థాయిలో అతగాడు వర్ధిల్లాలని కోరుకున్నాడంటే అందులో వింతేముంది? అంత చిన్న పాపానికి, పాపం, చిదంబరాన్ని తప్పు పట్టలేం కదా! ఎటొచ్చి, తానొకటి తలిస్తే దైవం మరొకటి తేల్చింది పాపం! ఇప్పుడు అదే కుమారరత్నం నిర్వాహకం పుణ్యమా అని చిదంబరం సీబీఐ శరపరంపరగా గుప్పిస్తున్న ప్రశ్నల జడివానలో తడిసి ముద్దవుతున్నారు!
మన ప్రపంచంలో, ముఖ్యంగా మన పుణ్యభూమిలో, కారణం లేని కార్యాలేవీ జరగవు. చిదంబరానికి ఈ గతి పట్టడానికి సైతం ఒకానొక కారణం ఉంది. ఆయన కేంద్ర హోమ్ మంత్రిగా ఉన్న రోజుల్లో అమిత్ షా గుజరాత్ లో చెలరేగి పోవడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ అగ్రనాయకుల ఆదేశాల మేరకే చిదంబరం, సదరు షా కి చెక్ చెప్పారు; సోహ్రాబుద్దీన్ ”ఎన్కౌంటర్” కేసులో షాని జైలుపాలు చేశారు. అది కూడా సీబీఐ చేతులమీదుగానే చేయించారు ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి. అదే ఇప్పుడు చిదంబరం మెడకు యమపాశంగా పరిణమించింది.
ఈ లోకంలో, ఏదైనా స్థిమితంగా ఉండొచ్చు కానీ కాలచక్రానికి మాత్రం కాలునిలకడ బొత్తిగా ఉండదు. ఎదో కొంపలు ములిగిపోతున్నట్లుగా గిరగిరా తిరుగుతూనే ఉంటుందది. ఆ విధంగా కాలచక్ర పరిభ్రమణంలో చిదంబరం అనే ఓడ బండిగా మారింది- అమిత్ షా బండి ఓడై కూర్చుంది. ఇటీవలనే సదరు షా కేంద్ర హోమ్ మంత్రిగా పదవీ స్వీకారం చేసి కొత్త అంకానికి తెర తీశారు. సీబీఐ చేతులమీదుగానే చిదంబరానికి “షా” చెప్పారు అమిత్ షా. అంతకు ముందు జరిగిన నాటకీయ పరిణామాల గురించి చెప్పకపోతే, కథ రక్తికట్టదు మరి! మాజీ కేంద్రమంత్రి చిదంబరం దేశం వదిలి పరారీ కాబోతున్నట్లు మన “ఇంటెలిజెంట్” వర్గాలు ఓ కథనం ప్రచారంలో పెట్టాయి. పత్రికాగోష్టిలో పాల్గొని వచ్చిన మాజీ హోమ్ మంత్రి ఇంటి గోడలు దూకి మరీ వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడితో కథ అయిపోలేదు. ఇది చిన్న మలుపు మాత్రమే!
కొన్ని వేల కేసుల్లో ముద్దాయిల్ని తికమక పెట్టిన వకీలు చిదంబరం సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరని కాదు- అంతటి వ్యవహర్తకి సొంత కేసు ఎలా పరిష్కరించుకోవాలో తెలియదనీ కాదు. అటు, చిదంబరమైనా- ఇటు షా అయినా రాజ్యాంగ బద్ధ వ్యవస్థల్ని రాజకీయ ప్రయోజనాల కోసం పుర్రచెయ్యి మాదిరిగా వాడుకోవడం ఎక్కడికి దారి తీస్తుంది? ఓడలు బళ్లయినప్పుడల్లా రాజ్యాంగ బద్ధ వ్యవస్థల్నిఇలా ఎడాపెడా వాడుకుంటూ పోతుంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి?
ఇవీ, మనం అందరం ఆలోచించాల్సిన ప్రశ్నలు ! కానీ, మన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ ప్రశ్నల తాలూకు ప్రాధాన్యం గుర్తించిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. రాజ్యాంగ బద్ధ వ్యవస్థలతో ఇలా పింగ్- పాంగ్ ఆడడం ఎంత ప్రమాదకరమో ఈ క్రియాశీలకులు గ్రహించినట్లు కనిపించదు. అందుకే అనేది- ప్రస్తుతం దేశం ఒకానొక విషాద భరిత నాటకంలోని ఆఖరి అంకాన్ని చూస్తోందని!!
“కానూన్ ఉన్నది కనుక, కానున్నది కాక మానదు!”
కానివ్వండి- అదీ చూద్దాం!!
– మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ