అమరావతి: ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలుంటే రికార్డులు కూడా ఇస్తామన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించటానికి వీల్లేదని చంద్రబాబు ఆదేశించారు.
వైసిపి వేలం పాటలా టిక్కెట్లు అమ్ముకుంటుందని చంద్రబాబు ఆరోపించారు. టిడిపిలో అలాంటి పరిస్థితి లేదనీ, పనిచేసిన వారితో పాటు సామాజిక న్యాయాన్నిఅభ్యర్థుల ఎంపికలో పాటిస్తున్నామని చంద్రబాబు అన్నారు.
టిక్కెట్ ఇవ్వలేకపోతున్నాం అని తాను చెప్తే అర్థం చేసుకున్నాం, పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీ కోసం ఇప్పుడు అండగా ఉన్నవారి భవిష్యత్తు పార్టీ చూసుకుంటుందనీ, అందరినీ గుర్తించి పదవులిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కుట్రలపై జాగ్రత్తగా ఉండాలని చద్రబాబు నేతలకు సూచించారు. ఈ మూడు రోజులు ఓట్లను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ 28 రోజులు ఎవరికీ విశ్రాంతి, మినహాయింపు లేవనీ గెలుపే ధ్యేయంగా యుద్ధానికి సన్నద్ధం కావాలని చంద్రబాబు నేతలకు సూచించారు.
రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞులనీ, విభజన నాటి పరిస్థితులు నేటి పరిస్థితులను అంచనా వేసే తీర్పు ఇవ్వబోతున్నారని చంద్రబాబు అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?