అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్స్టోన్ మైనింగ్ లీజ్ విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్ సిమెంట్ సంస్థకు, బిజినెస్ పార్టనర్ వేణుగోపాల్ రెడ్డికి కూడా నోటీసులిచ్చింది. ఈ కేసును మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.
సున్నపురాయి మైనింగ్ లీజు కోసం త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందని, దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ 2011లో తాడిపత్రికి చెందిన వి.మురళీ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు గత నెలలో దివాకర్ రెడ్డి సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆయన కుమారుడు, కోడలికి నోటీసులిచ్చింది.
కాగా, ఇటీవల జేసీ కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సులను వివిధ కారణాలతో ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.