(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్రలో ఏర్పడనున్న శివసేన ఎన్సిపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధామ్యాలు ఎలా ఉండవచ్చన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అన్నిటికన్నా ముందు బుల్లెట్ ట్రెయిన్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వినబడుతోంది. నూతన ప్రభుత్వం ప్రాధామ్యాల్లో బుల్లెట్ ట్రెయిన్కు చోటు ఉండదని శివసేన వర్గాలు తెలిపినట్లు ఎన్డిటివి పేర్కొన్నది.
అహ్మదాబాద్ ముంబై నగరాల మధ్య బుల్లెట్ రైలు నడపాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష. 88 వేల కోట్ల రూపాయల రుణంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రధాని షింజో అబె, ప్రధాని మోదీ కలిసి 2017 సెప్టెంబర్లో శంఖుస్థాపన చేశారు.
నూతన ప్రభుత్వం ముంబైలోని ఆరే కాలనీలో ఇక చెట్లు కొట్టనీయదని శివసేన ప్రతినిధి మనీషా కాయిండే తెలిపారు. ప్రధానంగా రైతుల సమస్యలపై దృష్టి సారిస్తాం. ఎన్నికల ప్రచారంలో అదే చెప్పాం. మాకు అదే ప్రధానం అని మరో శివసేన నేత, గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దీపక్ కేశార్కర్ చెప్పినట్లు ఎన్డిటివి తెలిపింది.
బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం 0.1 శాతం నామమాత్రపు వడ్డీతో 88 వేల కోట్ల రూపాయల రుణం ఇస్తున్నది. ఈ ప్రాజెక్టు ముందుకు నడవాలంటే కేంద్రం మొత్తం ఖర్చు భరించాలని కాంగ్రెస్ అంటున్నది.