YS Jagan: కాకినాడలో జరిగిన బహిరంగ సభలో సోదరి వైఎస్ షర్మిల వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ .. చంద్రబాబు, పవన్ కలిసి 2014 లో ఎన్నోహామీలను ఇచ్చారని అన్నారు. పేదవాడికి మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని అన్నారు.
రాబోయే రోజుల్లో అనేక కుట్రలకు తెర తీస్తారని దుయ్యబట్టారు. ముందు ముందు పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని విమర్శించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా అబద్దాలు చెప్పడం రాదని అన్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనేనని అన్నారు. కొత్త సంవత్సరం అంటే క్యాలండర్ మార్పు మాత్రమే కాదనీ, వారి జీవితంలో మార్పు జరగాలని అన్నారు. పింఛను మొత్తాన్ని ఇచ్చిన హామీ మేరకు మూడు వేలకు పెంచామని చెప్పారు.
66.34 లక్షల మంది ఈ పింఛన్ ను ప్రతి నెల ఒకటో తేదీన అందుకుంటున్నారని అన్నారు. సామాజిక పింఛన్లను పెంచడం ప్రభుత్వ ఉద్దేశ్యం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి ఆర్ధికంగా చేయూతను అందించడమేనని తెలిపారు. రెండు వేల కోట్ల రూపాయలు నెలకు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. సెలవు దినం అయినా, పండుగ రోజు అయినా సరే పింఛన్ ప్రతి నెలా ఒకటో తేదీన ఇస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు పాలనలో ఎన్నికలకు ముందు వరకూ కూడా వెయ్యి రూపాయలు పింఛన్ మాత్రమే ఇచ్చారని అన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు రూ.2వేలకు పెంచారని అన్నారు. అదీ కూడా తాను ఎన్నికల హామీలో ప్రకటించడం వల్ల చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని పెంచారని తెలిపారు. గత పాలనకు, ప్రస్తుత పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. గతంలో పింఛను పొందాలంటే ప్రజలు పడిగాపులు కాయడమే కాకుండా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలని అన్నారు. నేడు సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి ఇస్తున్నామన్నారు. బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదును జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు.. ఇప్పుడు జగన్ ఎందుకు చేయగలిగాడో ప్రజలు ఆలోచించాలని కోరారు.
చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే దత్తపుత్రుడు ప్రశ్నించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయలేదని అన్నారు. ఈ రోజు తమ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్లు కడుతూ టే సీబీఐ దర్యాప్తు జరపాలని కేంద్రానికి ఈ దత్తపుత్రుడు లేఖ రాశారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాలను ఆపించాలని ఈ దత్తపుత్రుడి ప్రయత్నమని విమర్శించారు. చంద్రబాబును అవినీతి కేసులో అరెస్టు చేస్తే ఈ దత్తపుత్రుడు జైలుకు వెళ్లి పరామర్శించి చాలా మంచోడని సర్టిఫికేట్ ఇస్తాడని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉండబట్టే ఈ దత్తపుత్రుడు నోరు మెదపడం లేదని అన్నారు. చంద్రబాబు హయాంలో నొక్కిన బటన్లు సున్నా అని అన్నారు. ఈ రోజు రూ.2.60 కోట్ల పేదలకు బటన్ నొక్కి అందజేశామని అన్నారు. చంద్రబాబు హయాంలో అమ్మఒడి, రేతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ లే లేవని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అబద్దాలు చెబుతారని, పిచ్చి పిచ్చి హామీలు ఇస్తారని అన్నారు. ప్రజలకు మంచిని చేసే వారినే ఎన్నుకోవాలని జగన్ పిలుపు నిచ్చారు.
YSRCP: ‘బుగ్గన’ బరిలోకి దిగాల్సిందేనా..?