ప్రభుత్వం వైపు ఆకర్షితులవడమో.. అధికార పార్టీ అంటే ఇష్టం పెరగడమో.. స్వప్రయోజనాలో.. లేక టీడీపీ నాయకత్వంపై విసుగు చెందడమో.. లేదా అదే టీడీపీలో ఉంటే తమ భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందనో.. కానీ టీడీపీ నాయకులు వైసీపీలోకి వెళ్తున్నారు. ప్రభుత్వం మారిన ఏడాదిన్నర కాలంలో కొందరు వైసీపీలోకి వెళ్లిపోయారు. మరికొందరు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరికొందరు ఆలోచిస్తున్నారు. ఈ ఆఖరి కేటగిరీలోకి వచ్చే టీడీపీ నేత విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు (గణబాబు) ఉన్నారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా అమరావతి రైతుల అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. అక్కడ గణబాబు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననది అందుకేనా..
విశాఖలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేశ్ కుమార్ ఇప్పటికే వైసీపీలోకి వెళ్లిపోయారు. గంటా కూడా వెళ్లాల్సింది.. ఆఖరి నిముషంలో వాయిదా పడింది. ఇప్పుడు పశ్చిమ ఎమ్మెల్యే వంతు అంటున్నారు. గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.. ఇతర నాయకులు పాల్గొన్నారు. గణబాబు వెళ్లకపోవడమే పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. వెలగపూడి రామకృష్ణ తరహాలో ప్రభుత్వంపై డైరెక్ట్ అటాక్ చేయడం లేదు. అలాగని టీడీపీ చెప్పిందీ చేయడం లేదు. కేవలం పరోక్షంగా ఈ పనులు చేయాలి.. అంటూ ఓ ప్రెస్ నోట్, ప్రకటనలకే పరిమితమవుతున్నారు. పార్టీ మారాల్సి వస్తే ఇబ్బందులు ఉండకూడదనే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అంటున్నారు.
పార్టీ మారే ముందు చేసేది ఇదే..
పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రకటనలు చేయకపోవడం.. కొందరు నాయకులు పార్టీ మారే ముందు చేసేవే. ఇప్పుడు గణబాబు ఆ లిస్టులో ఉన్నారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావుతోపాటే గణబాబు అనే వార్తలు ఆమధ్య వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన తీరు ఇది నిజమే అనిపిస్తోంది. మా నాయకుడు పచ్చ జెండా ఊపడమే తరువాయి.. అంటున్న అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలు కూడా గణబాబు వ్యవహరిస్తున్న తీరును ఉదహరిస్తోంది. దీంతో పార్టీలో ఎవరుంటారో ఎవరు వెళ్తున్నారో తెలీని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. గణబాబు నిజంగా పార్టీ మారితే చంద్రబాబుకు విశాఖలో గట్టి షాక్ తగిలినట్టే. ఎందుకంటే ఆయనకు ఇటివలే ఓ పదవి కూడా ఇచ్చారు మరి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?