(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించడానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను చేపడుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసీపీ అరాచక, అసమర్థ, అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొనివచ్చేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. తెదేపా నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు ఈ ప్రజా చైతన్యయాత్రలో పాల్గొని వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బాధితులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని పార్టీ శ్రేణులను ఆయన కోరారు. ఈ ప్రజా చైతన్యయాత్రను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.