రాజకీయంగా, పరిపాలకుడిగా దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబును చెప్పుకోవచ్చు. గడచిన రెండున్నర దశాబ్దాలుగా ఆయనకు అసమ్మతి రాగాలు, ఇబ్బందులు తలెత్తలేదు. కానీ. ఆయన అనుభం, అపర చాణక్యత ఇప్పుడు బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా పార్టీ కమిటీల నియామకంలో అసమ్మతి రేగుతోంది. సాధారణంగా ఇలాంటి అలకలు అసమ్మతి రాగాలు ఎన్నికల సమయంలో, బీఫామ్ విషయాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ.. టీడీపీలో కమిటీల నియామకంలో అసమ్మతి గళాలు, అసంతృప్తులు బయటకు రావడం చంద్రబాబు రాజకీయ అనుభవానికి పరిక్ష పెడుతోంది.
సీనియర్ల కినుకు.. అందుకేనా..!
ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత పార్టీ నేతల్లోని కొందరు టీడీపీని నమ్మటం లేదు. కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంటే.. మరికొందరు వైసీపీలోకి, బీజేపీలోకి వెళ్లిపోయారు. మిగిలినవారిలో కూడా ఎవరు ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ కమిటీ నియామకాలు అధినేతకు కొత్త సమస్య తెచ్చిపెట్టింది. ప్రభుత్వంపై తమ గళాన్ని, టీడీపీ వాయిస్ ను వినిపిస్తున్న చాలామందికి పార్టీ పదవులు దక్కలేదు. వీరిలో ఆలపాటి రాజా, దేవినేని ఉమ, పంచుమర్తి అనురాధ.. తదితరులు ఉన్నారు. గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారి గురించి చెప్పే పని లేదు. కులాల వారీగా కూడా చంద్రబాబు న్యాయం చేయలేదన్నది.. కినుక వహించిన వారి మాట. దీంతో చంద్రబాబే స్వయంగా బుజ్జగిస్తున్నట్టు సమాచారం.
చంద్రబాబుకు ఇది అలవాటే..
పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా.. మధ్యలో వచ్చిన వారిని అందలం ఎక్కిస్తారని.. చంద్రబాబుకు పేరు. గతంలో మంత్రి పదవులు రాక.. ఇప్పుడు కమిటీల్లో పదవులు రాక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2017లో మంత్రి పదవుల సమయంలో బయట నుంచి వచ్చినవారికే ఇచ్చారంటూ ఎంత రచ్చ జరిగిందో తెలిసిన విషయమే. ఇప్పుడు టీడీపీ కమిటీల విషయంలోనూ అదే జరుగుతోంది. పార్టీ సినియర్లు దీనిపై అలక వహిస్తున్నారు. అయితే.. పార్టీకి బలం తగ్గిందని భావిస్తున్న బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని వార్తలు వస్తున్నా సీనియర్లు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ ఎఫెక్ట్ తో పార్టీ నుంచి జంపింగ్ లు ఉండొచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.