అమరావతి: టిడిపి విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగితిస్తున్నట్లు రహమాన్ పేర్కొన్నారు. ఎన్ఆర్సి, రాజధాని అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ టిడిపికి రాజీమానా చేసినట్లు తెలిపారు.
జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటన టిడిపిలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. అమరావతిలో రైతుల ఆందోళనకు టిడిపి అధినాయకత్వం సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. మరో పక్క ఉత్తరాంద్రకు చెందిన టిడిపి నేతలు విశాఖలో పరిపాలనా రాజధాని నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. టిడిపి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు బాహాటంగా ప్రకటించారు. దీనికి తోడు రెండు రోజుల క్రితం విశాఖలోని ఒక హోటల్లో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు ప్రతిపాదనను స్వాగతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తీర్మానం చేస్తూ తీర్మాన ప్రతిని పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ఈ తీర్మానం పంపిన రెండు రోజులకే రహమాన్ టిడిపికి రాజీనామా చేశారు.త్వరలోనే రహమాన్ వైసిపిలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆయన ఇంకా ప్రకటన చేయలేదు.