చైనాకు చెందిన 52 యాప్ లు ప్రమాదకరమట. వాటిని బ్యాన్ చేయాలట. ఇది అన్నది ఎవరో కాదు. జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్-ఇన్). ఈ నేపథ్యంలో భారతీయులకు సంబంధించిన డేటాను దేశం అవతలికి తరలిస్తున్న చైనాకు చెందిన 52 యాప్స్ ను బ్యాన్ చేయాలని భారత నిఘా సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. ఒక వేళ బ్యాన్ చేయలేని పక్షంలో సదరు యాప్ లను ఉపయోగించ వద్దని ప్రజలకు సూచించాలని తెలిపాయి.
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(సెర్ట్-ఇన్) నిషేదించాలని సూచించిన జాబితాలో ప్రముఖ యాప్స్ అయిన జూమ్, టిక్ టాక్, యూసీ బ్రౌజర్, గ్జెండర్, షేర్ఇట్, క్లీన్ మాస్టర్ వంటి ప్రముఖ యాప్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వీటిలో ప్రతీ యాప్ ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే జూమ్ యాప్ ను ఉపయోగించవద్దని కేంద్ర హోంశాఖ అధికారులను ఆదేశించింది.
అయితే జూమ్ యాప్ ను నిషేధించిన మొదటి ప్రభుత్వం భారత్ కాదు. మన దేశం కంటే ముందే తైవాన్, జర్మన్ విదేశాంగ శాఖ, అమెరికా సెనేట్ ఈ యాప్ ను అధికారిక కార్యకలాపాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేశాయి. భద్రతా లోపాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని సెర్ట్-ఇన్ కేంద్రానికి తెలియచేసింది.
మొబైల్ యాప్స్ కారణంగా తలెత్తే భద్రతా సమస్యల గురించి ఎప్పటి కప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రముఖ వీడియో షేరింగ్ సంస్థ టిక్ టాక్ వంటి యాప్స్ పైనా ఈ అభియోగాలు రావడం వివాదాస్పదం అవుతోంది. చైనీస్ ఇంటర్నెట్ కంపెనీ బైట్ డ్యాన్స్ టిక్ టాక్, హెలో వంటి యాప్స్ ను రూపొందించింది. అయితే ఈ సంస్థ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నది. చైనీస్ డెవలపర్లు రూపొందించిన లేదా చైనీస్ కంపెనీలతో సంబంధాలు ఉన్న వారు రూపొందించిన ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ యాప్స్ ద్వారా స్పైవేర్, మాల్ వేర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రత దళాల్లో పనిచేసే సిబ్బంది వాటిని ఉపయోగించవద్దని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. సెర్ట్-ఇన్ సిఫార్సులపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.