మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపెల్లిలో మొన్న అర్దరాత్రి జరిగిన ఆరుగురు సజీవ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుపారీ గ్యాంగ్ తో ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తొంది. వివాహేతర సంబంధం, సింగరేణి వారసత్వ ఉద్యోగం, ఆస్తి గొడవల నేపథ్యంలో శనిగారపు శాంతయ్య అలియాస్ సత్యయ్య (57) భార్య సృజన, ఆమె ప్రియుడు కలిసి సుపారీ గ్యాంగ్ తో ఈ హత్యలు చేయించినట్లుగా భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
విషయంలోకి వెళితే … గుడిపెల్లి గ్రామానికి చెందిన శివయ్య (50) , ఆయన భార్య పద్మ (45), పద్మ అక్క కుమార్తె మౌనిక (23), ఆమె ఇద్దరు కుమార్తెలు హిమ బిందు, స్వీటి, మరో వ్యక్తి శాంతయ్యలు మొన్న రాత్రి సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల పరిశీలన చేయగా, పెట్రోల్ క్యాన్ లు, కారప్పొడి పొట్లాలు కనిపించాయి. ఇంటి తలుపుకు బయటకు గడి పెట్టినట్లుగా ఉండటంతో పథకం ప్రకారమే వారిని హత్య చేసి అగ్నిప్రమాదంగా సృష్టించి ఉంటారని పోలీసులు నిర్దారణకు వచ్చారు. హత్యకు గురైన వారితో ఎవరికైనా పాత కక్షలు, తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను ఆరా తీసిన క్రమంలో శివయ్య, పద్మ దంపతులకు ఎవరితోనూ గొడవలు లేవని తెలిసింది. అయితే అదే క్రమంలో వీరి ఇంటిలోనే నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు శాంతయ్యకు శివయ్య భార్య పద్మతో అక్రమ సంబంధం ఉందని తెలిసింది.
పద్మతో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే ఉంటుండగా, శాంతయ్య భార్య సృజన వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఆమె ఇద్దరు కుమారులు రాజ్ కుమార్, దీపక్ కుమార్ లు తండ్రి శాంతయ్య వారసత్వ ఉద్యోగం కోసం గత కొంత కాలంగా గొడవలు పడుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా శాంతయ్య జీతం డబ్బులను పద్మకు ఇవ్వడంతో పాటు ఊట్కూరులో ఉన్న స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ.25 లక్షల కూడా ఆమెకే ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో శాంతయ్యపై పగ పెంచుకున్న అతని భార్య సృజన ప్రియుడు సహకారంతో ఈ ఘాతకాలకు ఒడిగట్టినట్లుగా భావిస్తున్నారు. సృజనతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆహారంలో మత్తు మందు కలిపి వారు మత్తులోకి జారుకున్న తర్వాత పెట్రోల్ పోసీ నిప్పు అంటించినట్లుగా పోలీసులకు ప్రాధమిక విచారణలో తేలింది.
ఈ కేసు విచారణకు అడిషనల్ ఎస్పీ అఖిల్ మహాజన్ 12 టీమ్ లను ఏర్పాటు చేశారు. మరో ఆరుగురు కూడా ఈ ఘటనలో పాల్గొనట్లుగా గుర్తించిన పోలీసులు పెట్రోల్ బంక్ ల వద్ద సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించారు. సుపారీ గ్యాంగ్ దుండగులు శ్రీరాంపూర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. సిసి పుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే శాంతయ్యను హత్య చేసేందుకు సృజన రెండు నెలల క్రితమే దుండగులకు రూ.2లక్షలు సుపారీ ఇచ్చినట్లుగా తెలుస్తొంది. ఆ నేపథ్యంలో నెల రోజుల క్రితం శాంతయ్యపై హత్యాయత్నం జరిగింది. అయితే అది ఫెయిల్ కావడంతో శాంతయ్యతో పాటు పద్మ కుటుంబ సభ్యులను సజీవంగా దహనం చేశారు దుండగులు.