BJP Janasena Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ – జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తొంది. పొత్తు అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ముందుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లు మంతనాలు జరిపారు. ఆ తర్వాత అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. పొత్తుపై పయనంపై అవగాహనకు వచ్చేశారు.
పొత్తులో భాగంగా జనసేన పార్టీ 20 సీట్లు డిమాండ్ చేస్తుండగా, బీజేపీ అధిష్టానం జనసేనకు 9 నుండి 11 సీట్లు ఇవ్వడానికి సిద్దమైనట్లుగా తెలుస్తొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్రప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. అయితే కూకట్ పల్లి ని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం అంగీకరించినట్లు సమాచారం. అలానే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మిగితా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.
బీజేపీ అభ్యర్ధుల తదుపరి జాబితాపై అధిష్టానంతో చర్చించేందుకు నిన్న ఢిల్లీకి చేరుకున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో సమావేశమైయ్యారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్ చార్జి ప్రకాశ్ జవడేకర్, తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు ఈ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలిసింది. అదే సమయంలో రాజస్థాన్ మలి విడత జాబితాపై కసరత్తు నిర్వహణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నడ్డా నివాసానికి చేరుకున్నారు.
రాజస్థాన్ లో మరో 76 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉండగా, తెలంగాణలో 119 స్థానాల్లో రెండు విడతలుగా 53 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది బీజేపీ. మిగిలిన 66 స్థానాల్లో జనసేనకు కేటాయించనున్న స్థానాలను మినహాయించి అభ్యర్ధుల ఎంపిక చేసేందుకు తెలంగాణ కోర్ కమిటీ నేతలు నడ్డా నివాసంలో భేటీ అయ్యారు. ఇవేళ సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనున్నది.
ఈ భేటీలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు కమిటీ సభ్యులు దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ కే లక్ష్మణ్ తదితరులు పాల్గొననున్నారు. పోలింగ్ కు మరో 30 రోజులు మాత్రమే సమయం ఉన్నందున అభ్యర్ధుల ఎంపిక ప్రకియ పూర్తి చేసి ప్రచారంపై దృష్టి పూర్తిగా కేంద్రీకరించాలని బీజేపీ నేతలు సన్నద్దం అవుతున్నారు.
AP High Court: రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు కీలక ఆదేశాలు