లక్నో: దేశభక్తుల పిచ్చి రోజురోజుకూ ముదిరిపోతోంది. ప్రశ్నించినవాళ్ల మీద ఏదో ఒక ముద్ర వేసి చితకబాదడం అలవాటైపోయింది. ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలు లేవని అడిగినందుకు ఓ యువకుడి మీద ‘ఉగ్రవాది’ అంటూ ముద్ర వేయడమే కాక.. చేతికి అందినదల్లా పట్టుకుని అతగాడిని కొంతమంది వ్యక్తులు కలిసి చితక్కొట్టారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగింది. బీజేపీ కార్యకర్తలుగా భావిస్తన్న కొందరు కలిసి ఆ యువకుడిని చితకబాదారు. బోర్డు పరీక్షలు రాసేందుకు వెళ్లిన అతడు.. అక్కడకు వచ్చిన టీవీ సిబ్బంది అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని విమర్శించాడు. దాంతో కొంతమంది వ్యక్తులు కలిసి ఉన్నట్టుండి అతడిని కమ్ముకున్నారు. పిడిగుద్దులు కురిపించారు. అంతేకాదు, కర్రలు, రాళ్లు.. ఇలా చేతికి దొరికినదల్లా పట్టుకుని కొట్టడం ప్రారంభించారు. ఒకవైపు వీడియో రికార్డింగు అవుతున్నా కూడా దాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. తాను కేవలం ఉద్యోగాలు లేవని మాత్రమే అన్నానని, వెంటనే తాను ఉగ్రవాదినని, భారత దేశానికి, బీజేపీకి వ్యతిరేకిని అంటూ తనను కొట్టారని దాడి తర్వాత స్థానిక టీవీ చానళ్లతో మాట్లాడుతూ ఆ యువకుడు చెప్పాడు.
ఈ విషయంపై తాము తక్షణం చర్యలు తీసుకుంటామని ముజఫర్ నగర్ పోలీసులు చెప్పారు గానీ, ఇంతవరకు ఎవరినీ అరెస్టు మాత్రం చేయలేదు. దాడి చేసిన వారి ముఖాలు కూడా స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నా… పోలీసులకు మాత్రం వాళ్లెవరో ఇంకా తెలియలేదనడం విశేషం. ఎన్నికలకు ముందు బీజేపీలో నెలకొన్న అసహనానికి ఇది నిదర్శనమని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మోదీ చేశామని చెబుతున్న అభివృద్ధిని ప్రజలు నమ్మబోరన్న విషయం బీజేపీ కార్యకర్తలకు తెలుసని, అందుకే విమర్శించినవాళ్ల మీద ‘ఉగ్రవాదులు’గా ముద్రవేసి వాళ్లను కొడతారని ట్వీట్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ప్రతియేటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని సర్కారు నిలబెట్టుకోలేకపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 2016 సెప్టెంబరు తర్వాత అత్యధిక స్థాయికి నిరుద్యోగం చేరుకుంది. ఫిబ్రవరి నెలలో ఇది 7.2శాతంగా నమోదైంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఇది కేవలం 5.9 శాతం కావడం విశేషం. ఈ వివరాలన్నింటినీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తాజాగా వెల్లడించింది. లక్నోలో కశ్మీర్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యాపారులను కాషాయ దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులు పట్టుకుని కొట్టిన ఘటన మరువక ముందే, నిరుద్యోగం గురించి ప్రశ్నించిన వ్యక్తిని కూడా కొట్టడం గమనార్హం. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కశ్మీరీలపై పెరిగిన అసహనంలో భాగంగానే లక్నో దాడి కూడా జరిగిందని భావిస్తున్నారు. ఆ దాడికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ కావడంతో దానికి బాధ్యులైన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
(ఈ వీడియో ఎన్డిటివి సౌజన్యంతో)