న్యూఢిల్లీ: వినియోగదారుల వస్తువుల అమ్మకాల్లో రారాజు లాంటి హిందూస్థాన్ యూనీలీవర్ సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రకటన పెను సంచలనానికి దారితీసింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో హిందూస్థాన్ యూనీలీవర్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హిందువులు పాల్గొనే కుంభమేళా గురించి ఈ ప్రకటన రూపొందించారు. తాము ఉత్పత్తి చేసే ‘రెడ్ లేబుల్ టీ’ గురించి ప్రకటన ఇస్తూ.. ‘కుంభమేళాలో వృద్ధాప్యాన్ని నిషేధిస్తారు. మన పెద్దవాళ్లను మనం సంరక్షించుకోలేకపోవడం విచారకరం కాదా? మనల్ని ఇంతలా పెంచి పెద్ద చేసిన చేతులను పట్టుకోవాలని రెడ్ లేబుల్ ప్రోత్సహిస్తుంది. గుండెలను తడిమే ఈ వీడియో చూడండి.. ఇది ఓ కఠోర వాస్తవంపై కళ్లు తెరిపిస్తుంది’ అని ఆ ప్రకటన గురించి హిందూస్థాన్ యూనీలీవర్ ట్వీట్ చేసింది.
.@RedLabelChai encourages us to hold the hands of those who made us who we are. Watch the heart-warming video #ApnoKoApnao pic.twitter.com/P3mZCsltmt
— Hindustan Unilever (@HUL_News) March 7, 2019
ఆ ప్రకటనలో ఒక కొడుకు గుంపులో ఉన్న తన తండ్రిని వదిలేసి వెళ్లిపోతుంటాడు. ఆ పెద్దాయన ఎంత పిలిచినా అతడు పట్టించుకోడు. కానీ తర్వాత ఓ చిన్న పిల్లాడు తన తండ్రి చేతికి ఒక తువ్వాలు కడుతుండటం చూసి.. తన తప్పు తెలుసుకుని తిరిగి తండ్రి వద్దకు వస్తాడు. ఇద్దరూ కలిసి టీ తాగుతారు. అయితే, ఈ ప్రకటన చూసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ప్రపంచంలోనే అతి పెద్దదైన హిందువుల ఉత్సవాన్ని తప్పుగా చూపిస్తోందని మండిపడ్డారు. వెంటనే హిందూస్థాన్ యూనీలీవర్ సంస్థ ఉత్పత్తులన్నింటినీ బహిష్కరించాలంటూ కొన్ని హిందూత్వ సంస్థలకు చెందిన ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ప్రచారం మొదలుపెట్టారు. “#BoycottHindustanUnilever” అనే హ్యాష్ ట్యాగ్ కొద్ది సేపటికే ట్విట్టర్ లో ట్రెండ్ కావడం మొదలైంది. ప్రముఖ యోగాగురు రాందేవ్ బాబా కూడా ఈ ప్రకటనను తీవ్రంగా విమర్శించారు. హిందూస్థాన్ యూనీలీవర్ సంస్థ మనుషులను కూడా ఉత్పత్తులలాగే చూస్తుందని, మన దేశాన్ని ఆర్థికపరంగాను, సైద్ధాంతిక పరంగాను పేదదేశంగా మార్చడమే వాళ్ల ఏకైక లక్ష్యమని అన్నారు. అలాంటిది వాళ్లను మనమెందుకు బహిష్కరించకూడదని అడిగారు. మన భావోద్వేగాలతో సహా అన్నింటినీ వాళ్లు వస్తువుల్లాగే చూస్తారని, కానీ మనకు మాత్రం తల్లిదండ్రులు దైవంతో సమానమని చెప్పారు. ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా గగ్గోలు పుట్టడంతో ఎట్టకేలకు హిందూస్థాన్ యూనీలీవర్ దాన్ని తీసేసి.. సందేశం మార్చి మళ్లీ పోస్ట్ చేసింది.