అమరావతి, ఏప్రిల్ 30: కరువు, అకాల వర్షాలపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి అధికారులు గైర్హజరు అయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు ఈ సమావేశానికి హజరు కాలేదని తెలుస్తుంది.
కరువు, అకాల వర్షాలపై ఈ నెల 30వ తేదీ మంగళవారం సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 24వ తేదీనే సంబంధిత వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్, ప్రత్యేక కమిషనర్ మురళీధర్రెడ్డిలతో పాటు ఇతర ఉద్యోగులకు ఆయన కార్యాలయం నుండి సమాచారం అందించారు.
మంగళవారం సచివాలయానికి వచ్చిన ఆయన మూడు గంటల పాటు తన చాంబర్లో కూర్చున్నా అధికారులు సమీక్షా సమావేశానికి హజరు కాలేదు. అధికారులు రాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ముఖ్యమంత్రి, మంత్రులు ఏర్పాటు చేసి సమీక్షా సమావేశంలో అధికారులు పాల్గొనవద్దని ఇప్పటికే ఎన్నికల ప్రధాన అధికారి తెలియజేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల అదికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుండి రివ్యూలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇసి తీరును తప్పుబడుతూ లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాను వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహిస్తాననీ, ఎవరు ఆపుతారో చూస్తానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి గత వారం ప్రకటించారు. సమీక్షకు అధికారులు హజరుకాకపోతే సుప్రీం కోర్టుకు కూడా వెళతానని ప్రకటించి ఉన్నారు. సమీక్షకు అధికారుల గైర్హజరుపై మంత్రి సోమిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆశక్తికరంగా మారింది.