(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా ఇతర కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. ఆ సందర్భంగా విభజన సమస్యల పరిష్కారం, పోలవరం నిధులు తదితర అంశాలను ఆయన చర్చిస్తారని సమాచారం. అయితే అమిత్ షాతో జగన్ భేటీ ఇప్పటికే రెండుసార్లు రద్దు అయ్యింది. అక్టోబర్ 5న ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధానితో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఏపీలో పరిస్థితులను వివరించారు. పీపీఏల వ్యవహారంతో పాటుగా రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరంలో జరిగిన ఆదా గురించి వివరించారు. ఆ తరువాత ఆయన అమిత్ షా తో భేటీ కావాల్సి ఉన్నా సాధ్య పడలేదు. అక్టోబర్ 12న అమిత్ షాతో అపాయింట్ మెంట్ ఖరారైనా..చివరి నిమిషంలో రద్దైంది. మహారాష్ట్ర..హర్యానా ఎన్నికల కారణంగా అమిత్ షా బిజీగా ఉండటంతో పర్యటన వాయిదా పడింది. సోమవారం తిరిగి ముఖ్యమంత్రి జగన్ కు అపాయింట్ మెంట్ ఖరారు అయింది.
ఏపీలోని ప్రస్తుత తాజా పరిస్థితులతో పాటుగా.. రాజకీయ అంశాల పైన అమిత్ షాతో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కేంద్రం నుండి పీపీఏల సమీక్షపైన వస్తున్న అభ్యంతరాలు.. ఏపీలో ప్రస్తుతం డిస్కింల ఆర్ధిక పరిస్థితి గురించి సీఎం.. కేంద్ర హోంమంత్రికి వివరించనున్నట్లు సమాచారం. అదే విధంగా కేంద్రం నుండి పెండింగ్ లో ఉన్న పోలవరం రీయంబర్స్ మెంట్ నిధులను సైతం విడుదల చేయాల్సిందిగా సీఎం జగన్ కోరనున్నారు. ఏపీకి రెవిన్యూ లోటు నిధులు.. రాజధానికి ఆర్థిక సాయం.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల కేటాయింపు వంటి వాటి గురించి విభజన చట్టం నోడల్ శాఖగా ఉన్న హోం శాఖ చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వనున్నారు. రైతు భరోసా పధకంలో ప్రధాని పేరును సైతం జోడించిన తరువాత..జరగబోయే భేటీ కావటంతో ఇది అధికారికంగానే కాకుండా రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు గత ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం జగన్ మీడియాతో మాట్లాడలేదు. దీంతో విపక్ష టీడీపీ, జగన్ పై విమర్శలు గుప్పించింది. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రిని కలిసిన జగన్..ఆయనతో వాస్తవంగా ఏఏ అంశాలు చర్చించారో ముఖ్యమంత్రి వెంటనే ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మోదీని కలిశారనే అనుమానం కలుగుతోందని ఆరోపించింది. అయితే, తాజాగా అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం జగన్ మీడియాతో మాట్లాడతారా ? లేదా అన్నది కూడా ఉత్కంఠగా మారింది. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో సోమవారం రాత్రి జగన్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు సాయంత్రం సీఎం ఏపీకి తిరుగుపయనమవుతారని తెలుస్తోంది. మొత్తం మీద ఏపీలోని రాజకీయ పార్టీలు జగన్, అమిత్ షాల భేటీపైనే ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి.