అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి ప్యాకేజీ వద్దనీ ప్రత్యేక హోదానే కావాలని జగన్ స్పష్టం చేశారు.
గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేస్తూ ఆ ప్యాకేజీ తమకు వద్దని హోదా కావాలనే ఉద్దేశంతో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఎపికి జీవనాడి అయిన ప్రత్యేక హోదాను జాప్యం లేకుండా ఇవ్వాల్సిందిగా అయిదు కోట్ల ప్రజల తరపున ప్రకటన చేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్దంగా రాష్ట్రాన్ని విడగొట్టారని జగన్ అన్నారు. 2014లోనే కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక హోదా ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ప్లానింగ్ కమిషన్కు పంపితే గత చంద్రబాబు ప్రభుత్వం అక్కడకు వెళ్లి ప్రయత్నించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి పూర్తిగా గత చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే కారణమని జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు జగన్ వివరించారు.
దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు జోక్యం చేసుకొని కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రకటన చేసిందనీ, ఆ తరువాత వచ్చిన మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేకుండా అది ఎలా అమలు జరుగుతుందని ప్రశ్నించారు. కేవలం విమర్శలు చేయాలి, బురద చల్లాలి అనుకుంటే చల్లవచ్చు అని చంద్రబాబు అన్నారు. ‘మా హయాంలో తీసుకున్న నిర్ణయాలను మీరు అమలు జరపకుండా పక్కన పెడితే చేసేది ఏమి ఉంటుదని‘ అని చంద్రబాబు అన్నారు. 151మంది ఎమ్మెల్యేలు, 22మంది ఎంపిలతో ప్రత్యేక హోదా సాధిస్తామంటే మా కెలాంటి అభ్యంతరం లేదనీ, ప్రత్యేక హోదా సాధించాలనే కోరుతున్నామని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా సిఎం జగన్మోహనరెడ్డి నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అనేక వైఫల్యాలు జరిగాయని జగన్ ఆరోపిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.