న్యూఢిల్లీ: లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత పదవి స్వీకరించాల్సిందిగా రాహుల్ గాంధీని ఒప్పించలేకపోవడంతో ఆ పార్టీ పశ్చిమ బెంగాల్కు చెందిన అధీర్ రంజన్ చౌదరిని ఆ పదవికి ఎన్నుకొన్నది. 55 సీట్లతో కాంగ్రెస్ లోక్సభలో అతి పెద్ద ప్రతిపక్షం. అన్ని ముఖ్యమైన ఎంపిక కమిటీలలో అధీర్ చౌదరి తమ పార్టీ తరపున ఉంటారని పేర్కొంటూ లోక్సభకు లేఖ రాశారు.
చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం ఈ విషయం చర్చకు వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్సభ సమావేశాలు సోమవారం నుంచీ జరుగుతున్నందున ఇక జాప్యం చేయలేని పరిస్థితిలో అధీర్ చౌదరిని ఎన్నుకున్నారు. అధీర్ ఇప్పటికి అయిదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. గత లోక్సభలో కాంగ్రెస్ పక్షానికి నేతగా వ్యవహరించిన మల్లిఖార్జున్ ఖర్గే మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలయ్యారు.
ఈ సమావేశంలో స్పీకర్ ఎన్నిక గురించి కూడా కాంగ్రెస్ పార్టీ చర్చించింది. ఓమ్ బిర్లా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించకూడదని పార్టీ నిర్ణయించింది. దేశంలో లోక్భకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు బుధవారం నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన సమావేశం గురించి కూడా కాంగ్రెస్ చర్చించింది. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ వస్తున్నది.