గుంటూరు: మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడికి చెందిన షోరూం నుండి అసెంబ్లీ అధికారులు సోమవారం రాత్రి అసెంబ్లీ ఫర్నిచర్ను స్వాధీనం చేసుకొని తరలించారు.
గుంటూరులోని కోడెల కుమారుడి గౌతమ్ హోండా షోరూంలో అసెంబ్లీ అధికారులు మూడు రోజుల క్రితం జరిగిన తనిఖీలో అసెంబ్లీ ఫర్నిచర్ గుర్తించారు. ఆ రోజు కోడెల న్యాయవాది తానికొండ చిరంజీవి తనిఖీలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫర్నిచర్ను స్వాధీనం చేసుకోకుండా అధికారులు వెనుతిరిగారు. అనంతరం అసెంబ్లీ అధికారుల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కోడెలతో పాటు అయన కుమారుడి ఫై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో నేడు అసెంబ్లీ అధికారులు పోలీస్, రెవిన్యూ అధికారులతో కలిసి గౌతమ్ హోండా షోరూం నుండి ఫర్నిచర్ ను స్వాధీనం చేసుకొని అసెంబ్లీకి తరలించారు. 70 వస్తువులను షోరూంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తుళ్లూరు డీఎస్పి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిర్యాదు మేరకు అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారని డీఎస్పి తెలిపారు. అనంతరం అసెంబ్లీ అధికారుల ఫిర్యాదు మేరకు తాము కూడా దర్యాప్తును చేపట్టినట్లు డీఎస్పి శ్రీనివాసరెడ్డి వివరించారు.