అమరావతి: టిడిపి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వాటిని వెలికితీసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనలో, పోలవరం, రాజధాని పనుల వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో, గనుల లీజులు, ఐటీ ప్రాజెక్టుల వంటి వాటిలో, విద్యుత్తు రంగంలోని పిపిఎల్లో అవినీతి, అవకతవకలు, సమాచార దుర్వినియోగం, బంధుప్రీతి వంటివి చోటు చేసుకున్నాయా? అన్న అంశాల్ని ఉపసంఘం లోతుగా సమీక్షించడంతోపాటు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయనుంది. వీటితో పాటు పారదర్శక, అవినీతి రహిత పాలన, ప్రజాప్రయోజనాలే లక్ష్యాలుగా చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలను ఉపసంఘం సూచిస్తుంది. ఈ మేరకు ఉప సంఘాన్ని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి ఆరు వారాల గడువిచ్చింది.
క్యాబినెట్ సబ్ కమిటిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, పి.అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఎంపిలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మిథున్రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు హాజరవుతారు. అందరు మంత్రులు, అన్ని ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ రంగంలోని సంస్థలు సబ్ కమిటీ కోరిన సమాచారం, పత్రాలను అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది.సిఐడి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అవినీతి నిరోధక విభాగం నుంచి సూపరింటెండెంట్ స్థాయికి తగ్గని సీనియర్ అధికారులతో కూడిన బృందం సహకారం అందించాలని ఆదేశించింది.