అమరావతి: అధికారంలోకి వస్తే మద్యనిషేధం అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దానిపై దృష్టి సారించారు. ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, కేవలం ఆ శాఖను ఆదాయ వనరుగా చూడవద్దని జగన్ అన్నారు. మద్యపానం తగ్గించే దిశగా మద్యం బెల్ట్ షాపులను సమూలంగా తొలగించాలనీ, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే షాపుల లైసెన్సు రద్దు చేయాలని జగన్ ఆదేశించారు. అవసరమైన పక్షంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి బెల్ట్ షాపుల వ్యవస్థ నిర్మూలించాలని జగన్ సూచించారు.
అక్రమాలు ఎక్కడ జరిగినా మరింత కఠినంగా నిబంధనలు అమలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. దశల వారిగా మద్య నిషేదం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జగన్ సూచించారు.
శనివారం ఆయన ఆర్థిక శాఖ అధికారులతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి సృజనాత్మక ఆలోచనా విధానాలతో అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జగన్ సూచించారు.
గత ప్రభుత్వం పలు కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల నిధులు ఇతర పనులకు వాడినట్లు అధికారులు చెప్పడంతో సిఎం జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కుదేలయిన ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు ఆర్థిక క్రమశిక్షణ అందరూ పాటించాలని అధికారులకు సిఎం జగన్ సూచించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్థిక సంఘం ముందు సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితగతులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను వివరిస్తూ సమగ్రమైన నివేదికను తయారు చేసి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలని జగన్ అన్నారు.
సామాన్యుడిపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను జగన్ ఆదేశించారు.
ఆ దిశగా హరిత పన్ను, వ్యర్థ పదార్ధాలపై పన్ను, ఎర్రచందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరైన ఇసుక విధానం అమలు వంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి సాంబశివరావు, పివి రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి కె ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.