(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఏకంగా హైకోర్టునే ఏమార్చాలని చూశారు గుంటూరు అర్బన్ పోలీసులు. ఎంత పోలీసులయినా కథ అడ్డం తిరిగితే ఏం చేయగలరు. చివరికి విచారణను ఎదుర్కొంటున్నారు. గుంటూరు అర్బన్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధంలో ఉంచిన విషయం శుక్రవారం హైకోర్టు దృష్టికి వచ్చింది. గత నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ వారు ఎక్కడ ఉన్నదీ విచారణ జరిపి నెలలోగా తమకు నివేదిక సమర్పించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ జి. శ్యాంప్రసాద్తో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిని ఆదేశించింది.
కేసు వివరాలలోకి వెళితే క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారన్న అనుమానంపై అచ్చెంపేట ప్రాంతానికి చెందిన రాయిడి శ్రీనివాసరావు, నల్లబోలు ఆదినారాయణ, తూమాటి శ్రీనివాసరావు అనే ముగ్గురు వ్యక్తులను గుంటూరు అర్బన్, సిసిఎస్ పోలీసులు గత నెల 14వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచీ వారిని వివిధ పోలీసు స్టేషన్లలో ఉంచుతూవచ్చారు. వారి కుటుంబసభ్యులు వెళ్లి తమ వారి ఆచూకీ అడిగారు కానీ పోలీసులు స్పందించలేదు.
నిర్బంధితుల కుటుంబసభ్యులు అక్టోబర్ 29న గుంటూరు అర్బన్ ఎస్పి రామకృష్ణను కలిసి తమ వారిని విచిడిపెట్టాలని వేడుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. 30 తేదీన వారు హైకోర్టులో హెబియస్ కార్సస్ పిటిషన్ దాఖలు చేశారు. విషయం హైకోర్టు దృష్టికి వెళ్లడంతో పోలీసులు ప్లాన్ మార్చారు. 31వ తేదీన ముగ్గురు నిందితులనూ చేబ్రోలు పోలీసు స్టేషన్ తరలించాలని చూశారు. వారిని చేబ్రోలు తీసుకువెళ్లి గంజాయి కేసు బనాయించే ప్రయ్నత్నం జరుగుతున్న సంగతి నిందితుల లాయర్కు తెలిసింది. ఆయన కొందరు జర్నలిస్టులను వెంటతీసుకుని పోలీసు వాహనం వెంటపడ్డారు. పోలీసులు నిందితులను చేబ్రోలు పోలీసు స్టేషన్లో ఉంచిన సంగతి నిర్ధారణ చేసుకున్నతరవాత వారి లాయర్ మెజిస్ట్రేట్ కోర్టులో సెర్చి వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ ఓపెన్ కోర్టులో సెర్చి వారెంట్ ఆర్డర్ జారీ చేశారు. అందరికీ తెలిసిన సెర్చ్ వారెంట్ వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి లాయర్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు.
పోలీసులు ఆ రోజు రాత్రి ఏడు గంటలకు ముగ్గురినీ మెజిస్ట్రేట్ ముందు హజరుపరిచారు. అనుమానాస్పదంగా కనబడితే పట్టుకుని విచారించగా క్రికెట్ బెట్టింగ్ చేస్తామంటూ ముగ్గురూ వెల్లడించారంటూ కోర్టుకు విన్నవించారు. రిమాండ్ విధించే ముందు మెజిస్ట్రేట్ వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. పోలీసులు తమను ఎప్పుడు అదుపులోకి తీసుకున్నదీ, ఎక్కడెక్కడ తిప్పిందీ వారు పూసగుచ్చారు. ఈ వాంగ్మూలాలు హెబియస్ కార్పస్ పిటిషన్ విచారిస్తున్న హైకోర్టు బెంచ్ ముందుకు వెళ్లాయి.
శుక్రవారం కేసు విచారణలో కూర్చున్న ధర్మాసనం, హెబియస్ కార్పస్ పిటిషన్లో వివరాలూ, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలూ పరిశీలించింది. రెండూ సరిగ్గా సరిపోలడంతో న్యాయమూర్తులు కేసు లోతులు చూడాలని నిర్ణయించారు. నిందితులు గత నెల 14నుంచి 31 వరకూ ఎక్కడ ఉన్నారో విచారించి నివేదించాల్సిందిగా గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిని ఆదేశించారు.
పోలీసులు, నిందితులు, వారి కుటుంబసభ్యులు అందరూ విచారణకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు అవసరమైన మొబైల్ కాల్ డేటా సమకూర్చాలంటూ సర్వీస్ ప్రొవైడర్లను కూడా ఆదేశించింది.