(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మళ్లీ దానిపైనే దృష్టి సారించారా ?వైసీపీ 22 మంది ఎంపీలతో మరోసారి హోదా కోసం ప్రయత్నిస్తుందా ? అంటే అవుననే సమాధానం వివిపిస్తోంది. ఇంకా ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం జగన్ భావిస్తున్నారు. మొదటి నుంచి కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయాలనుకున్న జగన్కు మోదీ ప్రభుత్వం హోదా ఇవ్వబోమని తేల్చేసింది. ఏపీ ప్రజల కోరికైనా ప్రత్యేక హోదాపై ఇప్పుడు వైఎస్ జగన్ ఏమి చేయబోతున్నారని అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. దీంతో జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ నెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ వైసీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు. పోలవరానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో చర్చించాలని, రామాయపట్నం పోర్టు, రెవెన్యూ లోటుపై గట్టిగా అడగాలని కూడా స్పష్టం చేశారు. హోదాతోపాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను వైసీపీ ఎంపీలంతా కలిసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడినా ప్రయోజనం ఉండదని, అదో ముగిసిన అధ్యాయం అని ఏపీకి చెందిన బీజేపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏపీకి వేల కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందని చెబుతున్నారు. ఇదిఇలా ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఇప్పటికే సీఎం జగన్ పలుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశం కూడా అయ్యారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు పరచాలని, ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు,పదేళ్లపాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి ఏపీలో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు స్వీకరించిన జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారనే భావన ఏపీ ప్రజల్లో ఉంది. ఎన్నికల ముందు కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలలో ప్రత్యేక హోదా ప్రధానమైనది. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం.. అది కేవలం వైసీపీ వల్లే సాధ్యమవుతుందని గట్టిగా చెప్పడంతో ప్రజలు కూడా వీరిని నమ్మి ఓటు వేశారు. కానీ సీఎం పీఠం ఎక్కిన మరునాడే వైఎస్ జగన్.. బీజేపీ సంపూర్ణ మెజార్టీతో గెలుపొందడం వల్ల హోదా గురించి గట్టిగా అడగలేకపోతున్నామని, ఆ పార్టీకి ఇన్ని సీట్లు రాకుండా ఉండాల్సిందని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ఇప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యం అని చెబుతున్నారు. ఇక ఏపీలోని బీజేపీ నేతలు కూడా వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వంటి అంశాలపై జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ ప్రత్యేక హోదా రాదని తేల్చేశారు.
ఎన్నికల్లో ప్రజలు జగన్ కు ఓ ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు భారీ మెజార్టీతో అదికారం కటకటబెట్టారు. 22 మంది ఎంపీలను ఇచ్చారు. హోదా ఇవ్వని బీజేపీ అడ్రస్ గల్లంతు అయింది. చంద్రబాబు మాట మార్చారన్న అపప్రదతో ఓటమిపాలయ్యారు. మరోవైపు గత కొద్ది రోజులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జగన్ సర్కార్ పై గురి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ కేసుల విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. కేంద్రంతో చెలిమి కొనసాగించి ఎలాగైనా ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమాతో ఉన్న వైఎస్ జగన్కు పాలన తొలినాళ్లలోనే బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో జగన్ ఏం చెయబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.