దివంగత నేతల పేర్లను జిల్లాలకు పెట్టడం రివాజే. ఇప్పటికే ఏపీలో కడప జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరున వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు పెట్టిన విషయం తెలిసిందే. అటు తెలంగాణలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలకు పలువురు దివంగత నేతల పేర్లు పెట్టారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే.. ఏపీలోనూ త్వరలో జిల్లాల విభజన ప్రకియ జరుగనున్న నేపథ్యంలో ఇద్దరు ముఖ్య నేతల పేర్లు ఎ జిల్లాలకు పెడతారు అన్నది.
ప్రస్తుత ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో కమ్మ సామజిక వర్గీయులను ఆకట్టు కునేందుకు కృష్ణా జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరున ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివంగత నేత వంగవీటి మోహన రంగా అభిమానుల ఆకట్టుకునేందుకు రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెడతామని కూడా జగన్ ప్రకటించారు.
కాగా ఇప్పుడు నూతన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన కదలికల నేపథ్యంలో కృష్ణా జిల్లాను రెండు జిల్లాలుగా మారుస్తారని ప్రచారం జరుగుతుండగా ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరును పెట్టాలని అయన అభిమానుల నుండి డిమాండ్ వస్తోంది.
వంగవీటి మోహన రంగా జయంతి సందర్బంగా ఈ డిమాండ్ మరో సారి తెరపైకి వచ్చింది. బీజేపీ నేత వంగవీటి నరేంద్ర ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశామని పేర్కొన్నారు. వైకాపా లోని నేతలు రంగా స్మారకం పై సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రకటన చేయించాలని కోరారు.
కాగా గడచిన ఎన్నికల్లో జనసేన రంగంలో ఉన్నప్పటికీ వైకాపాకే ‘కాపు’ కసినందున రంగా అభిమానుల అభిమానం చిరస్థాయిగా ఉంచుకునేందుకు సీఎం జగన్ ఖచ్చితంగా ఒక జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెడతారని అనుకుంటున్నారు పరిశీలకులు.