న్యూఢిల్లీ: వైసిపి ఎంపిలంతా జగన్ విధేయులేనని చిత్తూరు ఎంపి రెడ్డప్ప అన్నారు. వైసిపి ఎంపిలు చాలా మంది తమ పార్టీ నాయకత్వంతో టచ్లో ఉన్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించడంపై వైసిపి ఎంపిలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసిపి ఎంపిలు సుజనాపై నిప్పులు చెరిగారు. వైసిపి ఎంపిలంతా జగన్ విధేయులేననీ, లేనిపోని ప్రచారంతో సుజనా గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సుజనాకు ధైర్యం ఉంటే తమ పార్టీ ఎంపిల్లో ఎవరు టచ్లో ఉన్నారో ఒక్కరి పేరు అయినా చెప్పాలని డిమాండ్ చేశారు. చివరి శ్యాస విడిచే వరకూ తాము వైసిపిలోనే ఉంటామని స్పష్టం చేశారు.
వైసిపి తలుపులు తెరిస్తే టిడిపి ఎమ్మెల్యేలంతా చేరిపోతారనీ, ఏపిలో టిడిపి బతికే పరిస్థితి లేదనీ రెడ్డప్ప అన్నారు. సుజనా బిజెపిలో ఉంటూ టిడిపికి ఏజెంట్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. పలువురు వైసిపి ఎంపిలు కూడా సుజనా చౌదరిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సుజనా చౌదరిపై విమర్శలు గుప్పించారు.