న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కి లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో క్లీన్ చిట్ ఇచ్చిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ఫిర్యాదుదారుకేకాక, ప్రధాన న్యాయమూర్తికీ, సుప్రీంకోర్టుకూ కూడా అన్యాయం చేసిందని మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీ వ్యాఖ్యానించారు.
ముగ్గురు న్యాయమూర్తులూ కమిటీ సభ్యులుగా కాకుండా క్లబ్ సభ్యులుగా వ్యవహరించారని ఆయన అన్నారు. బుధవారం అరుణ్ శౌరీ నానీ పాల్కీవాలా ఉపన్యాసం ఇస్తూ, న్యాయమూర్తుల కమిటీ పద్ధతిగా వ్యవహరించని కారణంగా ఆ న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తిని రక్షించేందుకే పని చేశారన్న అనుమానాలు ఎప్పటికీ తొలగిపోవని అన్నారు. దాని వల్ల సుప్రీంకోర్టు విశ్వనీయత దెబ్బ తింటుందని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదులు, ఇతర ప్రొఫెషనల్స్ ఇలాంటి తరుణంలో ఏం చేస్తుండాలి అన్న అంశంపై ఆయన ప్రసంగించారు.
‘ఎందుకిలా జరిగింది? ఎందుకంటే ఈ సంస్థ ప్రతిష్టను కాపాడాలన్న ఒక పనికిరాని ఆలోచన నీకుంది. ఇట్లాంటి భావనలు పాతకాలం నాటి క్లబ్ తరహా భావనలు. అంతేకానీ ఒక సంస్థకు వర్తించవు. ఆదీ పొద్దున్న లేస్తే పారదర్శకత గురించి మాట్లాడే సంస్థకా’ అని అరుణ్ శౌరీ అన్నారు. కమిటీ నివేదిక ఫిర్యాదుదారుకు ఇవ్వకపోవడం ద్వారా కమిటీ సిబిఐలా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ప్రభుత్వ వంచనకు దోహదకారులుగా మారిపోయారని అరుణ్ శౌరీ వ్యాఖ్యానించారు. న్యాయప్రపంచం క్లబ్లాగా తయారయిందని ఆయన అన్నారు.