ప్రయాగరాజ్: తండ్రి నుంచి ప్రమాదం ఉందని చెబుతున్న ఉత్తరప్రదేశ్ బిజెపి శాసనసభ్యుడి కుమార్తె సాక్షి మిశ్రా భర్తపై సోమవారం అలహాబాద్ హైకోర్టు బయట దాడి జరిగింది. తమకు రక్షణ కల్పించాలని కోరేందుకు హైకోర్టుకు వెళ్లినపుడు, సాక్షిని కులాంతర వివాహం చేసుకున్న అజితేష్ కుమార్పై వారికి భద్రత కల్పిస్తున్న పోలీసుల సమక్షంలోనే కొందరు వ్యక్తులు దాడి చేశారు.
అనంతరం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జంట ఎక్కడికి వెళ్లాలన్నా అధికారులు వారికి తగిన భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. 23 ఏళ్ల సాక్షి తాను ప్రేమించిన అజితేష్ను జూలై నాలుగున ఒక దేవాలయంలో వివాహమాడింది. బరేలీ ఎమెల్యే రాజేష్ మిశ్రా ఆమె తండ్రి.
సాక్షి మిశ్రా, ఆమె భర్త హైకోర్టు లోపలికి ప్రవేశిస్తుండగా కొందరు వ్యక్తులు అజితేష్పై దాడి చేశారనీ, పదేపదే చెంపదెబ్బలు కొట్టారనీ వారి న్యాయవాది ఎస్ఎన్ నశీం చెప్పారు. వారెవరో తెలియదు కానీ సాక్షికీ, ఆమె భర్తకూ ముప్పు ఉందన్న విషయం నిర్ధారణ అయిందనీ ఆయన పేర్కొన్నారు.
వివాహం తర్వాత సాక్షి మిశ్రా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసింది. అందులో తమను వెన్నాడుతున్న రౌడీలను వెనక్కు పిలిపించాల్సిందిగా అందులో ఆమె తన తండ్రిని కోరింది. వైరల్ అయిన ఈ వీడియో ద్వారా సాక్షి వ్యవహారం దేశమంతటా తెలిసింది. ‘పప్పా మా వివాహం అయిపోయింది. దయచేసి మమ్మల్ని మా బతుకు బతకనీయండి’ అంటూ ఆమె ఆ వీడియోలో తండ్రికి చేసిన విజ్ఞప్తి చాలామందిని కదిలించింది. తన అభ్యంతరం కులాంతర వివాహానికి కాదనీ, వారిద్దరి మధ్యా వయసు అంతరం ఎక్కువుందనీ, పైగా అజితేష్కు సంపాదన తక్కువనీ ఆమె తండ్రి పేర్కొన్నారు.