తీన్మార్ వార్తలు, కచ్చీరు ముచ్చట్లు, జులకటక, ధూంధాం వార్తలు, టింగురంగ వార్తలు, మాస్మల్లన్న, మామామియా – ఈ కార్యక్రమాలలో ఎలాంటి వార్తలు ఉంటాయి? ఎలాంటి వాటిని వారు వార్తలుగా పరిగణిస్తారు? నిజానికి ఈ ఆలోచన మొదలయినపుడు వార్తలనే కాస్త విభిన్నంగా, వ్యంగ్యంగా, హాస్యస్ఫోరకంగా మలచడం భావన అయి ఉండాలి. అంటే ఆ రోజు వార్తలను ఆ రకంగా మలచి ఇవ్వడం! కానీ వాస్తవానికి అలా ఉన్నాయా? పాపం, ఎవరికి తోచినట్టు వారు – ఉన్న పరిమితులలో వండుతున్నారు. అయితే చాలా సందర్భాలలో ఈ ప్రోగ్రాంలు వికటిస్తున్నాయి. ఈ మధ్య బంగారం కొట్టాయన కస్టమర్లే దేవుళ్ళని పేజీలకు పేజీలు ప్రకటనలు పత్రికలకు ఇచ్చాడు. దీని ఆధారంగా తీన్మార్ వార్తలలో బిత్తిరిసత్తి కిరీటం పెట్టుకుని ప్రత్యక్షమయ్యాడు. ఐటమ్ పేలింది! అయితే అన్ని సందర్భాలలో ఇలా ఉండటంలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మేగజైన్కు పనికివచ్చే వార్తలను ఇందులో వాడుతున్నారు. వాటిని అప్పటికే వార్తలలోనో, మొబైల్లోనో చూసి ఉంటాం. కనుక పేలడం లేదు.
నిజానికి ఈ కార్యక్రమం వార్తాపత్రికల్లో పొలిటికల్ కార్టూన్లాంటిది లేదా ఎడిట్ పేజీలో మిడిల్గా పరిగణించే వ్యంగ్య రచన. ఇది అంత సులువుగా పండదు. టెలివిజన్కు దృశ్యంగా పండటం ఇంకా కష్టం. కనుకనే ఇలాంటివి త్వరగా తేలిపోతాయి. ఛానల్ ఏదైనా ప్రోగ్రాం పేరేదైనా చివరివరకూ చూడటం కష్టంగా మారిపోయింది. మొత్తం రోజంతా ఎంత కష్టపడాలో… ఈ ఒక్క ప్రోగ్రాంకీ అంత కష్టపడాలి.
ఈ రకం వాటిల్లో కాస్త ఆలస్యంగా వచ్చింది ‘మామామియా’… ఇది ‘ఎట్టెట్టా’ అనే పేరుతో ఈ మధ్య మరలా మొదలైంది, ‘మామామియా’గా స్థిరపడింది. అయితే ఫార్మేట్ ఇంతకు ముందే ఒక పద్ధతికి అలవాటయిపోయింది. అందుకే ప్రతిరోజు పేలే వార్తలు దొరకడం కష్టమైపోయింది. దీనికి తోడు ఎన్టీవీ ‘నా వార్తలు నా యిష్టం’ మళ్ళీ ప్రారంభించింది. రోజులో ఐదారుసార్లు ఈ 10 నిమిషాల ప్రోగ్రాం పునఃప్రసారం అవుతోంది. మామూలుగా ప్రామినెంట్గా ఉండే పొలిటీషియన్లు మాత్రమే కాక చాలామంది ఇతరులను ఇందులో ఫీచర్ చేస్తున్నారు. కేసిఆర్, చంద్రబాబు, జగన్మోహన్రెడ్డి మాత్రమేకాక సోనియాగాంధీ, లక్ష్మీపార్వతి, నాదెండ్ల భాస్కరరావు, రోజా వంటి వారు కూడా ఈ బులెటిన్లు చదువుతున్నారు. మరీ నాదెండ్లవంటి వారితో బులెటిన్ చేయడం ఎలా? తాజా వార్తలు ఆయన కోణంలో అన్నీ ఉండవు. కనుక ఆయనకు సంబంధించిన గత విశేషాలు ఈ బులెటిన్లో చేరిపోతాయి. అదీ సమస్య! వరల్ట్కప్ సందర్భంగా విరాట్కోహ్లీతో ఐటమ్ ప్లాన్ చేయడం బావుంది. అయితే దాన్ని మరలా ఆదివారం కూడా చూడటం కష్టమైపోయింది.
తీన్మార్ వార్తలులో సావిత్రి మాయమైపోగా, పద్మ చదువుతోంది. ఇది బిగ్బాస్ ప్రభావం అట. బిగ్బాస్ ప్రారంభం కాకుండానే వార్తలరాక ఎక్కువైంది. శ్వేతారెడ్డి చేసిన ఫిర్యాదు వస్తుండగానే, అలాంటి ఫిర్యాదే గాయత్రీ గుప్తా చేసినట్టు కూడా సమాచారం. విషయం ఆందోళనపరిచే అంశం. అయితే ఇది కూడా పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంటా అనే సందేహం కూడా వస్తోంది.
జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకారం రోజున మూడు మీడియా సంస్థలు – ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ5, పేర్లు పేర్కొని హెచ్చరించారు. మిగతావాటిల్లో కన్నా వీటిల్లోనే వైకాపా వ్యతిరేక వార్తలు వివరంగా, తరచుగా, వ్యాఖ్యాన సహితంగా వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఘనకార్యాల వార్తలు నేడు కూడా ఒక్క సాక్షి టీవీలోనే కనబడుతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా ప్రస్తావించాలి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చాక సాక్షి టీవీ క్రమంగా ఆంధ్రప్రదేశ్ వార్తలను ఎక్కువ ఇస్తోంది. ప్రధాన అంశాలు, చర్చలు వైకాపా కొత్త ప్రభుత్వం మీదనే ఉంటున్నాయి.
99 టివీ శనివారం రాత్రి పదిన్నరకు ఓ బేబీ సినిమా ప్రముఖులతో అరగంట కార్యక్రమం లైవ్ ఇచ్చింది. దీనికి లైవ్, ఆ సమయంలో ఏమిటో? పావుగంట తర్వాత ఐదారు నిమిషాల బిట్ మళ్ళీ రిపీట్ అయ్యిందిట! నందినీరెడ్డి ఎలా డైలాగ్లు రాయించుకుంటారన్నది చర్చ. లైవ్లో రిపీట్ ఎలా సాధ్యమో బోధపడటంలేదు!
– డా. నాగసూరి వేణుగోపాల్