(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కరోనా లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రధానంగా విద్యారంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాలలను నిరవధికంగా మూసివేశారు. గతంలో ఎన్నడో ఒకసారి జరిగిన విధంగా ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు అప్ గ్రేడ్ చేసేశారు.
మార్చి, ఏప్రిల్ నెలలు విద్యార్థులకు పరీక్షల సీజన్. విద్యార్థులకు ముఖ్యమైన ఈ నెలల్లో లాక్ డౌన్ కొనసాగుతుండటం వారిని ఆందోళనకు, అయోమయానికి గురి చేస్తున్నది. ప్రభుత్వం
పదో తరగతి, డిగ్రీ పరీక్షలను వాయిదా వేసింది. రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తుల గడువు కూడా పెంచారు. ఎంసెట్, ఇసెట్, ఐసెట్, లాసెట్, పిజి సెట్, పిఇ సెట్ దరఖాస్తులు ఈ నెల 15వ తేదీ వరకు గడువు పెంచారు.
తొలి ప్రకటన ప్రకారం లాక్ డౌన్ ఈ నెల 14వ తేదీ వరకు అమలులో ఉంటుంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టనందున లాక్ డౌన్ మరి కొన్ని రోజులు పొడిగించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలు లాక్ డౌన్ తరువాత అయినా జరుగుతాయా లేక రద్దు అవుతాయా అనేది తెలియక విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. అదే విధంగా ప్రవేశ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలియక విద్యార్థులు అయోమయానికి గురి అవుతున్నారు.
ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు పరీక్షలు రద్దు చేసిన విధంగా పదవ తరగతి కామన్ పరీక్షలను రద్దు చేసే అవకాశం లేదు. మార్చిలో జరగాల్సిన పరీక్షలు మే నెలలో జరిగితేనే విద్యా సంవత్సరం నష్ట పోయే అవకాశం లేదు. మే నెల మొదటి వారంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే జూన్ నెలలో ఫలితాలు విడుదల చేస్తారు. పాఠశాలలు, కళాశాలలు జూన్ నెలలో రీ ఓపెన్ అవుతాయి. అయితే పరీక్షలు రెండు నెలలకు పైగా వాయిదా పడటం వల్ల విద్యార్థుల పాస్ పర్సెంటేజిపై ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.