ఢిల్లీ: రఫేల్ రివ్యూ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనంలో సోమవారం రివ్యూ పిటిషన్పై విచారణ జరుగనున్న నేపథ్యంలో నేడు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడానికి నాలుగు వారాలు సమయం కావాలని గత నెల 30న విచారణ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా ధర్మాసనం అంగీకరించలేదు. నాలుగు రోజులు మాత్రమే గడువు ఇస్తామని సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. దీంతో శనివారం కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
రఫేల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ అవసరం లేదనీ, రిప్యూ పిటిషన్ కొట్టివేయాలని కేంద్రం సుప్రీంను కోరింది. ఈ విషయంపై గత డిసెంబర్ 14వ తేదీన ఇచ్చిన తీర్పు సరైనదేననీ, ఆ తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది.
36 రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి ధరల వివరాలు కంట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్)కు సమర్పించామనీ, యుపిఎ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పదం కంటే 2.86శాతం తక్కువకే కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరిందని తెలియజేసింది. పిటిషన్లు కోర్టుకు సమర్పించిన పత్రాలు రహస్య పత్రాల్లో కొంత భాగమేననీ, అవి ఒప్పంద సమయంలో నిపుణులు ఇచ్చిన సలహాలకు సంబంధించినవి అని తెలిపింది. ఇది దేశ రక్షణకు సంబంధించిన అంశమనీ, కావున రహస్య పత్రాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు వివరించింది.