నెల్లూరు: ఈ నెల 15న సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన చంద్రయాన్ 2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించాలని ఇస్రో అధికారులు నిర్ణయించారు. అందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జిఎస్ఎల్వి మార్క్ 3ఎం 1 ద్వారా చంద్రయాన్ 2 ల్యాండర్ను నిర్దేశిత కక్ష్యలోకి పంపేందుకు సన్నద్ధం చేస్తున్నారు.
ఈ నెల 15న వేకువ జామున చంద్రయాన్-2 ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజనిక్ ఇంజిన్ ట్యాంకర్లోని ప్రెజర్ బాటిల్లో లీకేజీ ఏర్పడటంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. సోమవారం మధ్యాహ్నానికి ఇంధనాన్ని వాహక నౌక నుంచి తీసేశారు. తమిళనాడులోని మహేంద్రగిరి ఎల్పిఎస్సి కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు వాహక నౌకను తమ అధీనంలోకి తీసుకుని వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు.క్రయోజనిక్ ఇంజిన్ ట్యాంకర్లో ప్రెజర్ బాటిల్ లీకేజీ వల్లే 30 నుంచి 320 బార్లు ఉన్న పీడనం 290కు పడిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించి సమస్యను అధిగమించే చర్యలు చేపట్టారు.
21వ తేదీ ఆదివారం సాయంత్రం 6.43 గంటల నుంచి కౌంట్డౌన్ ప్రారంభం అవుతుందనీ, 20 గంటల పాటు కౌంట్డౌన్ ప్రక్రియ నిర్వహించిన తరువాత జిఎస్ఎల్వి మార్క్ 3 ఎం 1 సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుందని శాస్తవేత్తలు చెబుతున్నారు.
ఇస్రో శాస్త్రవేత్తల ఆహ్వానం మేరకు బుధవారం క్రయోజనిక్ ఇంజిన్ నిపుణుడు, పద్మశ్రీ వాసుదేవన్ జ్ఞానగాంధీ హైదరాబాద్ నుంచి షార్కు చేరుకొని సాంకేతిక సమస్యలపై ఇస్రో శాస్త్రవేత్తలతో చర్చించారు. రెండో ప్రయోగ వేదికపై ఉన్న వాహకనౌక, అందులోని క్రయోజనిక్ ఇంజిన్ను గాంధీ పరిశీలించారు. తదుపరి చేయాల్సిన పనులపై శాస్త్రవేత్తలతో సమీక్ష జరిపారు.