న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. సోమవారం(డిసెంబర్ 9) రాత్రి లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా బుధవారం రాజ్య సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఉపరాష్ట్రపతి ఓటింగ్ చేపట్టారు. రాజ్యసభలో మొత్తం 230 సభ్యులు హాజరుకాగా.. పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. ప్రతిపక్షాలు సూచించిన పలు సవరణలు వీగిపోయాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ ఈ బిల్లుకు మద్దతు తెలపగా.. కాంగ్రెస్, డీఎంకే, టీఆర్ఎస్ తదితర విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్ సభలోఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన.. రాజ్యసభలో ఓటింగ్కు దూరంగా ఉంది. ఆ పార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
అంతకుముందు, పౌరసత్వ సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలా? వద్దా? అనే అంశంపై ఓటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో సభలో మొత్తం 223 మంది సభ్యులు ఉన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపొద్దని 124 ఓట్లు, పంపాలని 99 ఓట్లు లభించగా, ఒకరు ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేందుకు నిరాకరించినట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్లుపై ఓటింగ్ నిర్వహించడానికి ముందు వివిధ పార్టీలకు చెందిన 44 మంది ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు హోం మంత్రి అమిత్ షా సమాధానాలు ఇచ్చారు. ఈ బిల్లుపై ఎనిమిది గంటలపాటు వాదోపవాదనలు కొనసాగాయి. అనంతరం ఈ బిల్లుపై ప్రతిపక్ష సభ్యుల సవరణ ప్రతిపాదనలు వీగిపోయాయి. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఆమోదం అనంతరం సభ వాయిదా పడింది. ఇప్పటికే లోక్సభలో భారీ మెజారిటీతో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు పెద్దల సభలో కూడా గట్టెక్కడంతో ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపిస్తారు. రాష్ట్రపతి సంతకం చేస్తే చట్టరూపం దాల్చుతుంది.
ప్రస్తుత పౌరసత్వ చట్టం-1955లోని నిబంధనలను సవరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. పౌరసత్వ సవరణ బిల్లు ప్రకారం..మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మత పీడనకు గురై ఆశ్రయం కోసం భారత్ వచ్చి దశాబ్దాలుగా శరణార్థులై ఉన్న ముస్లిమేతర (హిందూ, సిక్కు, పార్సీ, జైనులు, తదితర మతాల) వలసదారులకు కొన్ని షరతుల ప్రకారం భారత పౌరసత్వం ఇస్తారు. ఈ బిల్లు ద్వారా దేశ పౌరులెవరూ తమ పౌరసత్వ హక్కులు కోల్పోరని, దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.