శ్రీకాకుళం: కిడ్నీ వ్యాధి బాధితులకు స్టేజ్ 3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్తో పాటు, స్టేజ్ 3లో ఉన్న వారికి కూడా రూ. 5 వేల పెన్షన్ అందజేస్తామని తెలిపారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ ఆసుపత్రికి సీఎం జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గడప గడపకూ నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్రలో చెప్పినట్లుగా కిడ్నీ బాధితుల కష్టాలు తీరుస్తానన్న మాటను ఈరోజు నిలబెట్టుకున్నానని అన్నారు. కిడ్నీ బాధితులకు 10 వేల పెన్షన్ ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేశానని గుర్తుచేశారు. కిడ్నీవ్యాధి పీడితులకు ఉచిత బస్ పాస్సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. కిడ్నీ బాధితులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని, నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉద్ధానం ప్రాంతమంతా మంచినీటి తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన ముగించుకుని మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్కో హామీని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్లుగా తిత్లీ బాధితులకు పరిహారం పెంచుతున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ. 1500 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. జీడీమామిడి హెక్టార్కు 30వేల నుంచి 50వేల రూపాయలు చెల్లిస్తామన్నారు. జలయజ్ఞం ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తామని సీఎం స్పష్టం చేశారు. వంశధార ఆఫ్షోర్ , నారాయణపురం ఆనకట్ట పనులు త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. సెప్టెంబరు చివరి నాటికి సొంత ఆటో ఉన్నవారికి 10వేల రూపాయల ఫించన్పెంచి సగటున ఏడాదికి మూడు రెట్లు పెంచుతామన్నారు.
అక్టోబరులోనే రైతు భరోసా పథకాన్నిఅమలుచేస్తామని సీఎం ప్రకటించారు. రైతులకు ఏడాదికి 12,500 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఇప్పటి వరకూ 4లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వపథకాలకు ఎవరి చుట్టూ తిరగకుండా నేరగా లబ్ధిదారుల ఇంటివద్దకే చేరవేస్తామని అన్నారు. మత్స్యకారులకు లక్షరూపాయల నష్టపరిహారం, చేనేత కుటుంబాలకు 24వేలు చెల్లిస్తామన్నారు. జనవరి 26న అమ్మఒడి కార్యక్రమాన్ని చేపడతామని సీఎం జగన్ వెల్లడించారు.
ప్రజలకు స్వర్ణ రకం వంటి క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని జగన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించడం ప్రారంభిస్తామని, ఆరు నెలల పరిశీలన అనంతరం ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రతి పేదకూ ఆకలి తీరాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, క్వాలిటీ పెంచిన బియ్యాన్ని ప్రతి ఒక్కరికీ దగ్గర చేస్తానని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ బియ్యం ప్రతి లబ్దిదారుని గడపకూ చేరుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 చట్టాలు తెచ్చామని సీఎం జగన్ వివరించారు.