హైదరాబాద్: తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు… యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయని కేసీఆర్ పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉభయసభలు ఆమోదించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మొత్తం బడ్జెట్ రూ.1,46,492.3 కోట్లతో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరిలో రూ. 1.82 లక్షలతో కోట్లతో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో పోలిస్తే ఈ సారి అంచనాలు తగ్గాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ సగర్వంగా నిలిచిందని అన్నారు. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించిందన్నారు. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
రాష్ట్రవృద్ధిరేటు 10.5గా నమోదైంది. ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయిందని, మూలధన వ్యయంలో దేశంలో అగ్రగామిగా ఉందని తెలిపారు. నిధుల ఖర్చులో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాటా తక్కువగా ఉండేదన్నారు. సమైక్య పాలన చివరి పదేళ్లలో రూ.54,052కోట్లుగా ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో మూలధన వయ్యం లక్ష 65,165 కోట్లుగా ఉందని సీఎం చెప్పారు. నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు ఇవ్వడంతో… పారిశ్రామిక, వ్యవసాయరంగం పునరుత్తేజం సాధించాయని తెలిపారు. రైతుబంధు పథకం వ్యవసాయరంగానికి తోడ్పాటునందించిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించామన్నారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో… 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల తాను చింతిస్తున్నానని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా బడ్జెట్ ను రూపొందించాల్సి వచ్చిందని సీఎం చెప్పారు.
మాంద్యం ఉన్నా వ్యవసాయం, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు నిరంతరం కొనసాగుతుందన్నారు. పంట రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైతుబంధు కోసం 12వేల కోట్లు, రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం రూ.9402 కోట్లు కేటాయింపులు చేసినట్లు వివరించారు. కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయి అందలేదని, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందిన నిధులు రూ.31,802కోట్ల నిధులు మాత్రమే అందాయని చెప్పారు.
మొత్తం బడ్జెట్ రూ.1,46,492.3 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,11,055కోట్లు
మూలధన వ్యయం రూ.17,274.67కోట్లు
బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08కోట్లు
రాష్ట్ర ఆర్థిక లోటు రూ.24,081.74కోట్లు
Watchlive! Telangana Assembly Budget Sessions 2019 #TelanganaBudget https://t.co/3haro0zlSk
— Ace Media (@AceMedialive) September 9, 2019