హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల తలపెట్టిన ‘చలో ట్యాంక్ బండ్’ కార్యక్రమం పూర్తి అయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి ఆర్టీసీ సమ్మెపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రైవేటీకరణపై న్యాయస్థానం వ్యాఖ్యలు, కార్మికుల మిలియన్ మార్చ్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 11న కోర్టుకు సమర్పించాల్సిన నివేదిక ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.
తెలంగాణలో 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పర్మిట్ల వ్యవహారంపై న్యాయ పరమైన చిక్కులు రాకుండా ఏం చేయాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.