హైదరాబాదు, మార్చి 3: టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అత్రం సక్కు, రేగ కాంతారావులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతిపక్ష నాయకుడు మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన అత్యవసరంగా సిఎల్పి సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకుంటుందని పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
టిఆర్ఎస్ చర్యలను నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలో గల గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందనీ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గాంధీ విగ్రహం వద్ద 14మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ధర్నా చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి.
టిఆర్ఎస్ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ నెల ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దర్నాకు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది.