ఎంత మంది వెళ్లారు? ఎక్కడెక్కడ నివసించారు? ఎప్పుడు, ఎలా తిరిగి వచ్చారు? ఎక్కడెక్కడి వారు వెళ్లారు? దేశమంతటా ఇవే ప్రశ్నలు! ఇవే ఆందోళనలు! ఇవే భయాలు! పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలోని నిజాముద్దీన్లో తబ్లిగ్- ఈ- జమాత్ మార్కస్ కి వెళ్లిన వారి చుట్టూ ఇప్పుడు కరోనా తిరుగుతుంది. దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో ఎక్కువగా మూలాలు అక్కడి నుండి వచ్చిన వారే ఉన్నారు. తాజాగా ఏపీలో నిన్న ఇద్దరికీ బయటపడడం, తెలంగాణాలో అక్కడి నుండి వచ్చిన వారు ఆరుగురు నిన్న మరణించడం, అక్కడ ఢిల్లీలో ఆ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించడం… మరింత ఆందోళనలకు, భయాలకు తావిస్తుంది. ఈ ఉదంతం చుట్టూ సమాధానం లేని ప్రశ్నలు అనేకం మిగిలాయి.
కేసులన్నీ ఒకదాని వెంట ఒకటి…!
- చీరాలలో ఇద్దరికీ కరోనా ఉన్నట్టు తేలింది. వారిద్దరూ నిజాముద్దీన్ వెళ్లి వచ్చారు. వారితో పాటు వెళ్లిన వారిపై ఇప్పుడు నిఘా ఉంది. కొందరు దొరకలేదు.
- తాజాగా మంగళవారం ఏపీలో మరో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8 మంది అక్కడికి వెళ్లి వచ్చిన వారు ఉండగా, మరో అయిదుగురు వారి బంధువులు ఉన్నారు. ప్రకాశం జిల్లాలోనే 8 కేసులు బయటపడ్డాయి.
- నిన్న రాజమండ్రిలో ఒకరికి, కాకినాడలో ఒకరికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. వారిద్దరూ నిజాముద్దీన్ వెళ్లి వచ్చినట్టు తేలింది.
- తెలంగాణాలో నిన్న మరణించిన ఆరుగురు అక్కడి నుండి వచ్చిన వారే ఉండగా, ఇప్పుడు చికిత్స తీసుకుంటున్న వారిలో మరో 12 మంది అక్కడికి వెళ్లి వచ్చిన వారే ఉన్నారు.
- ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా ఇప్పుడు స్వీయ నిర్బంధం లో ఉన్నారు. ఆయన బంధువు ఒకరు నిజాముద్దీన్ వెళ్లి వచ్చారు. ఆయనతో పాటూ మరో నలుగురికి కరోనా పాజిటివ్ సోకింది. అందుకే అవే లక్షణాలతో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మొత్తానికి ఎమ్మెల్యే సహా 14 మంది ఆ లక్షణాలతో ఇప్పుడు క్వరెంటైన్ లో ఉన్నారు.
- అండమాన్ లో నిన్న తొమ్మిది మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. వీరందరూ నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారే.
- ఇలా దేశం మొత్తం మీద ఇప్పటికి 1385 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ జరిగితే నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారు 140 మంది ఉన్నట్టు తేలింది. ఇంకా బయటపడుతూనే ఉన్నాయి.
- అన్నిటికి మూల కేంద్రంగా ఉన్న నిజాముద్దీన్ లో 200 మంది ఇప్పుడు ఐసోలేషన్ లో ఉన్నారు. పోలీసులు అక్కడ పూర్తి నిఘా పెట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. కానీ అక్కడ భయం గుప్పిట జనం ఉన్నారు.
అసలేం జరిగింది…??
మార్చి 1 నుండి 15 వరకు నిజాముద్దీన్ లో జమాత్ ల ప్రార్ధనలు జరిగాయి. దీనికి 2500 మంది వరకు హాజరయ్యారని అంచనా. మలేషియా, ఇండోనేషియా, సౌదీ, దుబాయ్ దేశాల నుండి దాదాపు 1500 మంది దేశం నలుమూలల నుండి దాదాపు 1000 మంది హాజరయ్యారని అంచనా. ఈ వేడుక పూర్తయిన తర్వాత కూడా చాల మంది నిజాముద్దీన్ లోనే స్థానికంగా కొందరు ఇళ్లల్లో అతిధులుగా నివాసం ఉన్నారు. వేడుక ముగిసింది, హడావిడి ముగిసింది, మార్చి 18 తర్వాత నుండి తిరిగి రావడం ప్రారంభించారు. జనతా కర్ఫ్యూ నాటికి ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. తర్వాత ఒక్కొక్కరిలో ఆ వైరస్ బయటపడుతుంది. కానీ ఎవరెవరు వెళ్ళాను? ఎక్కడ తలదాచుకున్నారు? వారి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అనేది పూర్తిగా తెలియదు. పోలీసులు అదే పనిగా శోధిస్తున్నారు.
పోలీసులకు పెద్ద పని…!
ఆ ప్రార్ధనలు నిర్వాహకులపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశించడం, పోలీసులు ఈ ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు రంగంలోకి దిగడం జరిగిపోయాయి. మొన్న ఆదివారం నుండి పోలీసులు, మెడికల్ సిబ్బంది నిజాముద్దీన్ లో తనిఖీలు నిర్వహించగా చాలా మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వెల్లడయ్యింది. స్థానికంగా దాదాపు 400 మంది వరకు ఈ నిర్వహణలో భాగం పంచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దేశీయంగా వచ్చిన వారు మార్చి 16 తర్వాత ట్రైన్లు, విమానాల ద్వారా స్వస్థలాలకు చేరుకున్నారు. కానీ ఎవరు వచ్చారు , ఎంతమంది , వారు ఎక్కడి వారు అనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. ఇదే పెద్ద పనిగా ఉంది. ఇది తేలి, అందర్నీ ఐసొలేట్ చేస్తే కొంత వరకు ఆందోళన తీరినట్టే.