(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ముస్లిం పాలకుల ఏలుబడిలో ఉన్న ప్రాంతాలలో కొన్ని ఊళ్లకు ముస్లిం పేర్లు ఉండడం సహజం. వాటిని మారుస్తామనీ, చరిత్రను తిరగ రాస్తామనీ హిందుత్వ వాదులు, బిజెపి నాయకులు అంటుంటారు. వీలైన చోట్ల ఆ పని చేస్తున్నారు కూడా. యోగీ ఆదిత్యనాధ్ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ నగరం పేరు ప్రయాగరాజ్గా మారిపోయింది. ఢిల్లీలో ఔరంగజీబ్ మార్గ్ కాస్తా డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం రోడ్డుగా మారిపోయింది.
హైదరాబాద్ నగరం పేరు భాగ్యనగరంగా మారుస్తామని కొందరు చెప్పగా చాలాసార్లు విన్నాం. అలాంటి పనులు మామూలుగా సాధ్యం కాదనుకున్నారో ఏమో హైదరాబాద్ నగరం అనగానే గుర్తుకువచ్చే హుస్సేన్ సాగర్ పేరును ఎవరోగానీ గూగుల్ మాప్స్లో సైబర్ హాకింగ్ ద్వారా జై శ్రీరామ్ సాగర్గా మార్చేశారు. అక్టోబర్ ఒకటి నుంచి పదవ తేదీ వరకూ గూగుల్ మాప్స్లో హుస్సేన్ సాగర్ పేరు అందరికీ ఇలానే కనబడింది. చివరికి దాన్ని మళ్లీ సరిచేశారు.
అట్లాగే సాలార్జంగ్ పూల్ పేరును ఛత్రపతి శివాజీ వంతెనగా మార్చారు. గత ఫిబ్రవరిలో ఎవరో ఆ వంతెన దగ్గర శివాజీ బ్రిడ్జ్ అని సైన్బోర్డును పాతారు. ట్రాఫిక్ పోలీసులు అది గమనించి ఆ బోర్డు తొలగించారు. మూసి నది మీది ఆ వంతెనకు ఉత్తరం వేపున శివాజీ విగ్రహం ఉండడంతో దుండగులు ఈ పని చేశారు. ఉత్తరం వేపున సాలార్జంగ్ మ్యూజియం ఉంటుంది.
ఆ వంతెన కింద నుంచి పారే మూసి పేరును కూడా ఆన్లైన్లో సైబర్ విధ్వంసకులు ముచికుంద అంటూ మార్చారు. ఈ నది ప్రస్తావన చరిత్రలో మొదటగా 1611-15 మధ్య దక్షిణ భారతంలో పర్యటించిన విదేశీ చరిత్రకారుడు పీటర్ ఫ్లోరిస్ రచనల్లో వస్తుంది. అందులో మూసీ నది అనే రాశారు. తర్వాత ఏనుగుల వీరాస్వామి రాతల్లో దీనిని మొదటిసారిగా ముచికుంద నదిగా ప్రస్తవించారు.
‘ది హిందూ’ దినపత్రిక సౌజన్యంతో