(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రుతుపవనాలు ముఖం చాటేయ్యడంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఆశాకిరణంగా మారింది. దీని ఫలితంగా నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 48గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో కోస్తా అంతటా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా ఆ తరువాత వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఆదివారం ఒడిసాలో విస్తారంగా, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి కోస్తాలో అనేక చోట్ల మేఘాలు ఆవరించి మధ్యాహ్నం నుంచి జల్లులు ప్రారంభమయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అల్పపీడనంతో సోమవారం ఒడిసాలో, సోమ, మంగళవారాల్లో ఛత్తీస్గఢ్, విదర్భ, మంగళవారం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోస్తాలో మంగళవారం వరకు విస్తారంగా, అక్కడక్కడా భారీవర్షాలు, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున కోస్తా, ఒడిసాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో పడమర దిశగా మధ్యభారతం మీదుగా పయనిస్తున్నదనీ, దీంతో జూలై నాలుగులోగా రుతుపవనాలు వాయవ్య, ఉత్తర భారతంలో అనేక ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యభారతం, దానికి ఆనుకుని మధ్య మహారాష్ట్ర, మరట్వాడా, కొంకణ్ వరకు భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.
కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఆదివారం మధ్యాహ్నం భారీగా వర్షం కురవడంతో భక్తులు విడిది గృహాలకే పరిమితమయ్యారు. క్షేత్రంలోని ప్రధాన వీధుల్లో వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. కర్నూలు నగరం, సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లోనూ ఒక మోస్తరు వర్షం కురిసింది.