రాబోయే 50 ఏళ్లలో మృతుల అకౌంట్లే ఎక్కువ
ప్రస్తుతం కొనసాగుతున్న వేగంతోనే ఫేస్ బుక్ భవిష్యత్తులోనూ విస్తరిస్తూ పోతే.. రాబోయే 50 ఏళ్లలో అందులో బతికున్నవారి ఖాతాల కంటే మృతుల ఖాతాలే ఎక్కువగా ఉంటాయట. ఈ శతాబ్దాంతానికి ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నవారిలో చనిపోయినవారి సంఖ్య దాదాపు 490 కోట్లకు చేరుకుంటుందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ ఇంటర్ నెట్ యూనివర్సిటీ (ఓఐఐ)కి చెందిన కొందరు ఈ అంశంపై పరిశోధించారు. 2018 నాటికి ఉన్న యూజర్లను చూస్తే వారిలో 140 కోట్ల మంది 2100 కంటే ముందే మరణిస్తారు. ఈ లెక్కన 2070 నాటికే బతికున్నవారి కంటే మరణించిన వారి ఫేస్ బుక్ అకౌంట్లే ఎక్కువగా ఉంటాయి.
ఈ లెక్కల వల్ల చాలా కొత్త, కష్టమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఓఐఐలో పరిశోధక విద్యార్థి, ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన కార్ల్ ఓమన్ చెప్పారు. మొత్తం డేటాకు హక్కులు ఎవరికి ఉంటాయి, మరణించిన వారి స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రయోజనాల రీత్యా వాటిని ఎలా నిర్వహించాలి, భవిష్యత్తులో చరిత్రకారులు గతాన్ని తెలుసుకోడానికి దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చనే ప్రశ్నలు వస్తాయన్నారు.
ఈ విశ్లేషణ రెండు రకాల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని చెబుతోంది. 2018 తర్వాత కొత్త యూజర్లెవరూ చేరలేదని అనుకుంటే.. ఆసియాలో ఈ శతాబ్దాంతానికి ప్రస్తుతమున్నవారిలో దాదాపు 44% మంది మరణిస్తారు. ఫేస్ బుక్ ప్రొఫైల్స్ లో సగానికి పైగా ఇండియా, ఇండోనేసియాలవే ఉన్నాయి. ఈ రెండు దేశాల నుంచి 2100 నాటికి దాదాపు 27.9 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్లు మరణిస్తారు. రెండో పరిస్థితి చూస్తే.. ఫేస్ బుక్ ప్రస్తుతం ఉన్నట్లే, 13% వృద్ధి చెందుతూ పోయిందని అనుకుందాం. మార్కెట్ పూర్తిగా సంతృప్త స్థాయిని చేరేవరకు ఇది కొనసాగుతుంది. ఇలా అయితే ఆఫ్రికాలో ఎక్కువ మంది యూజర్లు మరణించి ఉంటారు. మనం చనిపోయినా మన డిజిటల్ వివరాలు మాత్రం యథాతథంగా ఉంటాయని, వాటి నిర్వహణ చాలా కష్టం అవుతుందని ఓమన్ తెలిపారు.
ప్రతి దేశం నుంచి సుమారుగా ఎంతమంది మరణించే అవకాశం ఉందన్న విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటుంది. ఆ లెక్కల ఆధారంగానే ఈ పరిశోధన చేశారు. చరిత్రకారులు, ఆర్కీవిస్టులు, పురావస్తు పరిశోధకులను ఫేస్ బుక్ ఆహ్వానించి, మరణించిన వారు వదిలిపెట్టి వెళ్లిన సమాచారాన్ని మధించాల్సిందిగా చెప్పాలని అంటున్నారు.