అమరావతి : రాజకీయ నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించినప్పటి నుండి సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు పరిపాలనపై, ఆయనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సారి బహిరంగ వేదికపై కాకుండా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పేరు ప్రస్థావించకుండా తనదైన శైలిలో విమర్శిస్తూ సెటైర్ వేశారు.
‘దూసుకొస్తున్న ఫణి తుఫాను తమిళనాడు కు పోతుందని ఆశిద్దాం. పొరపాటున ఆంధ్ర తీరాన్ని తాకింది అంటే ఇక ముఖ్య కార్యదర్శి లక్ష్యంగా విపత్తుల నిపుణుడు తన అనుకూల మీడియా సహాయంతో చేసే హంగామా అంతా ఇంతా ఉండదు’ అంటూ ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.
దూసుకొస్తున్న ఫణి తుఫాను తమిళనాడు కు పోతుందని ఆశిద్దాం. పొరపాటున ఆంధ్ర తీరాన్ని తాకింది అంటే ఇక ముఖ్య కార్యదర్శి లక్ష్యంగా విపత్తుల నిపుణుడు తన అనుకూల మీడియా సహాయంతో చేసే హంగామా అంతా ఇంతా ఉండదు.
— IYRKRao , Retd IAS (@IYRKRao) April 26, 2019
ఈ ట్వీట్పై పలువురు ఆయనపై తీవ్రంగా విమర్శలు చేశారు.
విపత్తు మనకి రాకూడదు అని అనుకోవడం మంచిదే కానీ, పక్క రాష్ట్రంకి పోవాలి, వాళ్లు నాశనం అవ్వాలి అని ఎలా అనగలుగుతున్నారు? అందరూ బాగుండాలి అని అనుకోవాలి కానీ పక్క వాళ్లు నాశనం అవ్వాలని చూస్తే ముందు పోయేది మీరే జాగ్రత్త అంటూ ఒకరు, ప్రకృతి విపత్తు ముంగిట కళ్లాల్లో తడిచిపోయే ధాన్యం గురించో లేక నష్టపోయే రైతుల గురించో కాక రాజకీయ పరమార్ధం కోసం తపించడం శోచనీయం, సిగ్గు పడండి అంటూ మరొకరు ప్రతి విమర్శలు చేశారు.
వీటిపై ఐవైఆర్ స్పందించారు.
‘ఫణి తుఫాను ట్వీటు ఎక్కడో బాగా గట్టిగా తగిలినట్టుంది. మొరిగే బ్యాచ్ మొదలైంది. ముఖ్య కార్యదర్శి, ప్రధాన ఎన్నికల అధికారి మీద బాబు అండ్ కో అల్లుతున్న పుక్కిటి పురాణాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ నెల రోజులకు ఇంకేదైనా వ్యూహం ఆలోచించుకుంటే మంచిది.’ అని సూచిస్తూ ఐవైఆర్ కృష్ణారావు మరో ట్వీట్ పోస్టు చేశారు. దీనిపై ఇంకా తీవ్రంగా విమర్శలు వచ్చాయి.
ఫణి తుఫాను ట్వీటు ఎక్కడో బాగా గట్టిగా తగిలినట్టుంది. మొరిగే బ్యాచ్ మొదలైంది. ముఖ్య కార్యదర్శి ప్రధాన ఎన్నికల అధికారి మీద బాబు అండ్ కో అల్లుతున్న పుక్కిటి పురాణాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ నెల రోజులకు ఇంకేదైనా వ్యూహం ఆలోచించుకుంటే మంచిది.
— IYRKRao , Retd IAS (@IYRKRao) April 27, 2019
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ అయిన తరువాత ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. కార్పోరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తరువాత కొద్ది రోజులకు కృష్ణారావు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.