ప్రధానమంత్రి నరేంద్రమోదీని తొలిసారి కలిసినపుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ శ్రీశ్రీ రవిశంకర్ ఏమన్నారు? ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు చోటుచేసుకున్నాయి? 2014 ఎన్నికల్లో మోదీ అఖండ మెజారిటీతో గెలిచి భారత ప్రధాని అవుతారని నాలుగు రోజుల ముందే రవిశంకర్ చెప్పేశారా? గుజరాత్ అల్లర్ల గురించి మోదీ కళ్లలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించిన గురూజీకి.. ఆ తర్వాత ఆయన మీద విశ్వాసం ఎలా కలిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతకాలంటే… రవిశంకర్ గురూజీ రాసిన బ్లాగ్ పోస్టు చదవాల్సిందే. 2014 మే 12వ తేదీన.. అంటే ఎన్నికల ఫలితాలు రావడానికి సరిగ్గా 4 రోజుల ముందు ఆయనీ బ్లాగ్ రాశారు. ‘మై ఫస్ట్ మీటింగ్ విత్ నరేంద్ర మోదీ’ అనే శీర్షికతో దీన్ని ఆయన ప్రచురించారు.
నాటి ప్రచారక్.. నేటి ప్రధాని
తొలిసారి న్యూయార్క్ నగరంలో 2000లో జరిగిన ఓ సదస్సులో తాను మోదీని కలిసినట్లు రవిశంకర్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి మిలీనియం ప్రపంచ శాంతి సదస్సులో రవిశంకర్ ప్రసంగించారు. ఆ ప్రసంగం చాలా క్లుప్తంగా, సూటిగా ఉందని.. అందరూ ప్రశంసించారని నాటి ప్రచారక్ మోదీ ఆయనకు చెప్పారు. తర్వాత మరోసారి 2004లో శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ.. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని కలిశారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి నేరుగా అడిగినప్పుడు ఆయన కళ్లు చెమర్చి ఉన్నాయని రవిశంకర్ రాశారు. అప్పటికి మోదీని విమర్శించడం అందరికీ ఒక ఫ్యాషన్ గా మారిందన్నారు. అలాకాకుండా కాస్తయినా మోదీకి మద్దతుగా మాట్లాడితే వెంటనే ఆర్ఎస్ఎస్ మనిషనే ముద్ర పడిపోయేదన్నారు. కానీ తాను మాత్రం మోదీని నేరుగా ఢీకొట్టాలనే భావించానని రాశారు. తామిద్దరం కలిసి కూర్చోగానే నేరుగా ఆయన కళ్లలోకి చూస్తూ ‘అల్లర్లను ఆపేందుకు మీరు మీ పూర్తి సామర్ధ్యంతో పనిచేశారా?’ అని అడిగానన్నారు. తాను అంత సూటిగా ప్రశ్నించడంతో మోదీ ఆశ్చర్యపోయారని, కాసేపటి తర్వాత తేరుకుని తడిసిన కళ్లతో.. ‘గురూజీ, మీరు కూడా ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారా’ అన్నారని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవని, అల్లర్లలో ఆయన పాత్ర ఉండకపోవచ్చని తనకూ తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కావాలని ముఖానికి నల్లరంగు ఎందుకు పూసుకుంటారని రవిశంకర్ తన బ్లాగులో రాశారు. కొద్ది నిమిషాల మౌనం తర్వాత.. సత్యం ఆయనవైపే ఉందని, ఆ విషయాన్ని ఏదో ఒకరోజు జాతి మొత్తం గుర్తిస్తుందని చెప్పానని అన్నారు.
ప్రధానిగా ఆయన్ను కలుస్తానేమో
తర్వాతి రోజుల్లో తానెప్పుడు గుజరాత్ వెళ్లినా మోదీ తనతోపాటు కొద్దినిమిషాలు ధ్యానంలో కూర్చునేవారని చెప్పారు. గ్రామాభివృద్ధి అంటే తనకు ఇష్టమని తెలిసి.. గ్రామాలలో తాను చేసిన పనులు చూపించేవారని అన్నారు. కొన్నిసార్లు తమ సత్సంగాలలో కూడా పాల్గొన్నారన్నారు. అమెరికా చాలాకాలం పాటు మోదీని ఆహ్వానించలేదని, అక్కడే తాను ఆయనను తొలిసారి కలిశానని చెప్పారు. తర్వాత 14 ఏళ్లలో పరిణామాలు చాలా మారాయని అన్నారు. ఈసారి ఆయనను కలిసేటపుడు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అధిపతి కావచ్చని రాస్తూ తన బ్లాగ్ పోస్టును ముగించారు. అంటే, మోదీ ప్రధాని కాబోతున్నారని పరోక్షంగా వెల్లడించారు.
దేశంలో మరో సిరియా?
రామమందిరం గొడవ పరిష్కారం కాకపోతే, భారతదేశంలో మరో సిరియా తయారవుతుందని 2018 మార్చిలో ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. వివాదాస్పద భూమిలో రామమందిరం కడితే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని రవిశంకర్ చెప్పారు. అప్పుడు వేరే వర్గం ప్రజలు అసంతృప్తితో ఉంటారని, దాంతో సమస్యలు తప్పవని అన్నారు. మనం ఏమైనా తీసుకుంటే అవతలివాళ్లకు వేరే ఏవైనా ఇవ్వాలన్నారు. అక్కడ ఒక మసీదు లేదా ఆస్పత్రి కట్టచ్చని తెలిపారు. కానీ ఆ ప్రదేశం గురించి 100 కోట్ల మంది ప్రజలకున్న విశ్వాసాలను గౌరవించాలని చెప్పారు. 100 కోట్ల మంది ప్రజల గౌరవమా.. లేదా చిన్న భూమి ముక్కా.. ఏది పెద్దదని ప్రశ్నించారు.