అమరావతి, ఏప్రిల్ 8: ఎన్నికల ప్రచార పర్వానికి మరో 24గంటల్లో తెరపడనుంది. రాష్ట్రంలోని ఎక్కువ నియోజకవర్గాల్లో అధికార టిడిపి, వైసిపి మధ్య నువ్వా నీనా అన్నరీతిలో పోటీ నెలకొని ఉన్నది.
టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసిపి ఆధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయం తక్కువ కావడంతో హెలికాఫ్టర్లు ఉపయోగిస్తున్నారు. రోజు రెండు మూడు జిల్లాల ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు.
ప్రధానంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ఓటర్ల తీర్పు కీలకం కానుంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు పెద్దగా ఓటింగ్ పెరిగే అవకాశం లేకపోయినా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోది, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా, యుపి ముఖ్యమంత్రి యోగి అదిత్యనంద్ దాస్, కేంద్ర మంత్రి రాజ్నాధ్ సింగ్లు ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొన్నారు.
చంద్రబాబుకు మద్దతుగా పశ్చిమ బెంగాల్, ఢిలీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు ప్రచారం చేయగా, వైసిపికి పార్టీ అధినేత తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, సినీనటులు మోహన్బాబు, జీవిత, రాజశేఖర్, ఆలీ తదితరులు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు పాలన చూశాం, సంక్షేమ పథకాలు ఎవరు ఉన్నా అమలు చేస్తారు, ఒక సారి జగన్ పాలన కూడా చూద్దాం అన్న అలోచన కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుండి వినబడుతోంది. చంద్రబాబుకు మరో సారి అవకాశం ఇస్తే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతాయనీ, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పే వారూ ఉన్నారు.
కొన్ని నియోజకవర్గాలలో జనసేన చీల్చే ఓట్ల వల్ల టిడిపి, వైసిపి అభ్యర్థుల తలరాతలు మారే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రజాకర్షక శక్తి టిడిపికి ఉపయోగపడటం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు.
నేటి ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో ఉండడంతో ఆ పార్టీ చీల్చే ఓట్ల వల్ల టిడిపి ఓటు బ్యాంకుకు గండిపడుతుందని భావిస్తున్నారు. అయితే అవి ప్రధాన ప్రతిపక్షానికి దక్కకుండా జవసేనకు చెందడం అధికారపక్షానికి ఉపకరిస్తుందన్న వాదన కూడా ఉంది.
గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకున్నా కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే వైసిపి అధికారానికి దూరం అయ్యింది. ఇప్పుడు బిజెపి, జనసేన టిడిపి పక్షాన లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత అంశాలు తమకు కలిసి వస్తాయని వైసిపి భావిస్తుంది.
ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాల వల్ల తిరిగి ప్రజలు తమనే అదరిస్తారని టిడిపి విశ్వసిస్తోంది. జనసేన పార్టీకి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సామాజిక బలానికి తోడు యువత ఆకర్షితులు కావడం వల్ల కొన్ని సీట్లు కూడా గెలుచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. జనసేన పార్టీలో మాజీ సిబిఐ జెడి వివి లక్ష్మీనారాయణ చేరి విశాఖ పార్లమెంట్ బరిలో పోటీ చేయడం ఆ పార్టీకి కొంత మేర కలిసి వచ్చే అంశమేనని చెబుతున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల ఎన్నికల ప్రచార సభలకు ఎక్కడ చూసిన పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు మీటింగ్ పెట్టినా, సినీ నటులు ప్రచారానికి వచ్చినా పెద్ద ఎత్తున జనాలు మాత్రం పోగు అవుతున్నారు.
ప్రచార పర్వం ముగియకముందే ఓట్ల కొనుగోలు కార్యక్రమానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లో తెరతీసినట్లు సమాచారం. కీలక నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా మూడు నుండి ఏడు వేల రూపాయల వరకూ పంపిణీ చేయడానికి వెనుకాడని పరిస్థితి. ఒక పక్క ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా నిల్వ ఉన్న, రవాణా చేస్తున్ననగదును స్వాధీనం చేసుకుంటున్నా అభ్యర్థులు రకరకాల ఎత్తుగడలు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. చివరి 48గంటల పోల్ మేనేజ్మెంట్లో ఎవరు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.